26-09-2025 12:10:36 AM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) జిల్లాలో చందుర్తి మండలంఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు ఇచ్చారు. చందుర్తి మండల, కట్టలింగంపేట గ్రామాల్లో తుది దశకు చేరుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో కలెక్టర్ గురువారం పరిశీలించారు.
పోలిశెట్టి లక్ష్మీ, కట్టలింగంపేటలో పల్లికొండ మౌనిక, మారుపాక నర్సవ్వ, కొంక సృజన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటుండగా వారితో కలెక్టర్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు దీపావళి లోగా పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకోవాలని సూచించారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేస్తూ ఆన్ లైన్ లో నమోదు చేయాలని, లబ్ధిదారులకు ప్రభుత్వ తరఫు నుంచి ఆర్థిక సహాయం సకాలంలో అందేలా అధికారులు చూడాలని, పెండింగ్ ఉండకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, ఇసుక తీసుకెళ్ళెందుకు కూలీ, రవాణా చార్జీలు మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందని, జిల్లాలో ఎక్కడైనా 1500 కంటే ఎక్కువ ట్రాక్టర్ ఇసుక సరఫరా కోసం వసూలు చేస్తే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇసుక కోసం ఇబ్బందులు ఎదురైతే సంబంధిత తహసీల్దార్లను సంప్రదించాలని, లబ్ధిదారులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. పర్యటనలో పిడి హౌసింగ్ శంకర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ, తదితరులు పాల్గొన్నారు.