26-09-2025 12:10:38 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాకాలవాగు ఒడ్డున అరుదైన కాకతీయానంతర శైలి శిల్పాన్ని తెలంగాణ వారసత్వశాఖ అధికారి మల్లునాయక్ గుర్తించారు. సమపాద స్థానకభంగిమలో పద్మపీఠంపైన నిల్చొని ఉన్న ఈ మూర్తి ద్విభుజుడి రూపంలో ఉంది. కుడిచేతిలో జలపాత్ర, ఎడమచేతిలో శంఖం ధరించి ఉన్నాడు. మెడలో హార, గ్రైవేయకాలున్నాయి.
దండరెట్టలమీద, ముంజేతులకు కంకణాదులున్నాయి. కాళ్లకు కడియాలు, పాం జీబులున్నాయి. కౌపీనం ధరించి ఉన్నాడు. పరివారంగా చక్రపురుషుడు, గదాదేవి ఉన్నారు. ప్రతిమా క్షణాలను బట్టి ఈ మూర్తి ధన్వంతరి. ఈ శిల్పం నిరాలంబంగా ఉంది. ధన్వంతరి శిల్పాలు సర్వాభరణాలంకృతమై కనిపిస్తాయి.
శైలిని బట్టి ఈ శిల్పం కాకతీయానంతరశైలికి చెందినదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఈ శిల్పాన్ని పాకాలవాగు ఒడ్డున నుంచి వరంగల్ పురావస్తు ప్రదర్శనశాలకు తరలించాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలంగాణ వారసత్వశాఖను కోరుతున్నది. ఈ మూర్తి ప్రతిమా లక్షణాలను గుర్తించడంలో సుపర్ణమహి (టీ మహేశ్, అద్దంకి) సహకరించారు.