గడువులోగా మౌలిక వసతులు పూర్తి చేయాలి
రాష్ట్ర ఆర్&ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు
బిజినేపల్లి, జూన్ 8 : వట్టెం ఆర్&ఆర్ కాలనీలో కొనసాగుతున్న పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్&ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశిం చారు. పునరావాసం పొందనున్న కుటుంబాలకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు నాణ్యతతో కూడినవిగా ఉండాలన్నారు. సోమవారం మండలంలోని వట్టెం గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన పునరావాస మరియు పునర్నిర్మాణ (ఆర్&ఆర్) కాలనీని అదనపు కలెక్టర్ అమరేందరుతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆర్&ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు పరిశీలించారు.
కాలనీలో నిర్మించిన గృహాలు, అంతర్గత రహదారులు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య వ్యవస్థతో పాటు ఇతర మౌలిక వసతులను ఇరువురు క్షుణ్ణంగా పరిశీలించారు. కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితుల సంక్షేమం దృష్ట్యా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కాలనీల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజలకు అందిస్తున్న సౌకర్యాల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. కాలనీలో నివసిస్తున్న కుటుంబాలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.






