ఆర్టీసీ బస్ స్టాండ్ పరిసరాల్లో సిసి కెమెరాల ఏర్పాటు
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతంలో ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న ద్విచక్ర వాహనాల దొంగతనాల నివారణకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ మేరకు దొంగతనాలకు తావులేకుండా ఉండేలా బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించారు. సోమవారం కరీంనగర్ టౌన్ ఏసీపీ, వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ గారు ప్రత్యక్షంగా బస్ స్టాండ్ ప్రాంగణాన్ని సందర్శించి, భద్రతా పరమైన అంశాలను పర్యవేక్షించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించి, కెమెరాలు అమర్చాల్సిన పాయింట్లను గుర్తించారు.
బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టేలా 24 గంటల నిఘాను ఏర్పాటు చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం అని ఏసీపీ తెలిపారు. వాహనదారులు తమ వాహనాలను సురక్షితమైన ప్రదేశాల్లోనే పార్క్ చేయాలని, పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. బస్ స్టాండ్ వచ్చే ప్రయాణికుల రక్షణ మరియు వాహనాల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, త్వరలోనే ఈ నిఘా వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.




