27-05-2025 10:17:06 AM
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు
పదేళ్ల పాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికాలే
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లక్ష కోట్లు ఖర్చుపెట్టారు
ఖానాపూర్ లో రూ.200కోట్లతో యంగ్ ఇండియన్ ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు భూమిపూజ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖానాపూర్ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క
కడ్తాల/తలకొండపల్లి: రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు తమ ప్రభుత్వం పూనుకుందని గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గ కేంద్రాల్లో పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆయన హామీని ఇచ్చారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తాను కూర్చి వేసుకొని పూర్తి చేస్తానని మాజీ సీఎం పాలమూరు రైతన్న గారికి హామీని ఇచ్చారు... మరి పదేళ్ల పాలనలో ఎందుకు పూర్తి చేయలేదని ఆయన నిలదీశారు. లక్షల కోట్లతో ఉత్తర తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు కు ఖర్చు చేశారని.... దక్షిణ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపారని ఆయన ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి ఖానాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 200కోట్లతో నిర్మించే యంగ్ ఇండియన్ ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లురవి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి భూమిపూజ చేసి శిలాఫలకంను ఆవిష్కరించారు.
నియోజకవర్గంకు రూ. 18 కోట్లతో నిర్మించే ఎనిమిది 33/11. కేవీ సబ్ స్టేషన్లు ఖానాపూర్, మక్తమాధారం, సంకటనిపల్లి, కలకొండ, కొత్త బ్రాహ్మణపల్లి గ్రామాలకు అయన వర్చువల్ ప్రారంభించారు. అంతకుముందు ఖానాపూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. కల్వకుర్తి నియోజకవర్గం కు తనకు 1880 నుంచి విడదీయరాని సంబంధం ఉందన్నారు. ఈ ప్రాంత రైతులు లో ఓల్టేజి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లురవి తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే సబ్ స్టేషన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకోసం, ప్రజలకోసం పని చేస్తుందని అన్నారు.
ఈ ప్రాంత ప్రజల కోసం 132కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ లపై గత బిఆర్ ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టులు కట్టమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన లక్ష కోట్లు ఖర్చుపెట్టారని మండిపడ్డారు. మహాలక్ష్మి స్కీమ్ తో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ప్రతి టికెట్ కు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ పథకానికి రూ.3.600కోట్లు బడ్జెట్ లో పెట్టామన్నారు. ఆర్టీసీని మూసేస్తారన్న బిఆర్ ఎస్ నేడు ఆర్టీసీ లాభాలబాటలో నడుస్తుందని అన్నారు.
రాష్టంలో 95శాతం కుటుంబాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుందని రూ.2.400కోట్లు విద్యుత్ శాఖకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాష్టంలో 95లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ అందుతుందని, 90లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నదంటే దేశంలోనే అది తెలంగాణ అని చెప్పవచ్చు. పదేళ్ల పాలనలో ఇండ్ల గురించి బిఆర్ ఎస్ పట్టించుకోలే.. ప్రజా పాలనలో ప్రతి నియోజకవర్గానికి 3500ఇండ్లని కేటాయించి గుడిసెలు లేని రాష్టంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నదని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నామన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో అభివృద్ధి గురించి కేసీఆర్ ఆలోచించారా? అని ప్రశ్నించారు.
బిఆర్ ఎస్ నాయకులు నోరుపారేసుకుంటే సరైన సమాధానం చెబుతాం: ఎంపీ మల్లురవి
బిఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపైనా కాని ముఖ్యమంత్రిపై నోరోపారేసుకుంటే సరైన సమాధానం చెబుతామని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఖానాపూర్ బహిరంగసభలో అయన మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమం అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. కల్వకుర్తిపై ఏనాడు బిఆర్ ఎస్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతాయని మల్లురవి పేర్కొన్నారు.
పాలమూరు - రంగారెడ్డి పూర్తి చేసి సాగునీరు ఇవ్వండి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి కల్వకుర్తి నియోజకవర్గానికి సాగునీరు ఇవ్వాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా నాల్గు మండలాల పరిధిలో విద్యుత్ బిల్లులు 1. 10కోట్లు కరెంట్ బకాయిలు చెల్లించామన్నారు. 132కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేస్తే ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్య ఉండదని ఉప ముఖ్యమంత్రిని కోరారు. అదే విదంగా పలు సమస్యలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు. 200కోట్లతో ఇంటి గ్రేటెడ్ పాఠశాల మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్ చల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మెగారెడ్డి, డిసిసి అధ్యక్షుడు నర్సింహారెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్,పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్, సూదిని రాంరెడ్డి, మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా, పోలీషన్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, సాంస్కృతిక చైర్ పర్సన్ వెన్నెల గద్దర్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లిలో ఉప ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.