29-07-2025 12:12:11 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పులుల రక్షణతో పర్యావరణ సమతుల్యత సాధ్యం అవుతుందని ఆసిఫాబాద్ అటవీ డివిజన్ అధికారి దేవిదాస్ అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ పులుల దినోత్సవం(International Tiger Day) సందర్భంగా ఆసిఫాబాద్ లో చేపట్టిన బైక్ ర్యాలీ ని జెండాలు ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులుల సంరక్షణ తో పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని తెలిపారు. పోడుసాగు వల్ల అటవీ విస్తీర్ణం తగ్గడంతో పులుల సంరక్షణ కష్టంగా మారిందన్నారు.
దీనికి అడవులను నరకకుండా ఉండడమే పరిష్కారం అన్నారు. జిల్లాలోని గిరిజనులకు పలుచోట్ల వెదురుతో వస్తువులు ఏవిధంగా తయారు చేయాలనే అంశాన్ని నేర్పిస్తున్నామన్నారు. ఆదివాసీలకు అటవీశాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా కార్యాలయం నుండి బయలుదేరిన బైక్ ర్యాలీ హెడ్ క్వార్టర్స్ మీదుగా ఎమ్మెల్యే ఇంటి ముందు నుండి సబ్ జైలు మీదుగా కార్యాలయం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్, డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేష్, ఝాన్సీరాణి, విజయ్ ప్రకాష్, సెక్షన్ అధికారులు మహేందర్, విజయ్, సతీష్, బీట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.