2 March, 2026 | 2:28 AM

అనుమానాస్పద మృతిపై విచారణ వేగవంతం చేయాలి

02-03-2026 12:42 AM

ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్, మార్చి 1 (విజయక్రాంతి)నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామంలో మూడు నెలల చిన్నారి అనుమానాస్పదంగా నీటి తొట్టిలో వేసి హత్య చేసిన దారుణ ఘటనపై ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్పందించారు. ఘటనపై వేగవంతంగా విచారణ పూర్తి చేసి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం పాలెం గ్రామాన్ని సందర్శించిన వారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చిన్నారి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఇటీవలి కాలంలో చిన్నారులపై జరుగుతున్న దారుణ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించి నిందితులను త్వరగా పట్టుకుని చట్టపరమైన కఠిన శిక్షలు విధించాలని పోలీస్ శాఖకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తెలిపారు.