calender_icon.png 3 January, 2026 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంత్‌‌కు చోటుందా!

03-01-2026 12:00:00 AM

కివీస్‌తో వన్డే సిరీస్‌కు నేడు భారత జట్టు ఎంపిక

బుమ్రా, హార్థిక్ పాండ్యాకు రెస్ట్

ఇషాన్ కిషన్, షమీకి ఛాన్స్

11 నుంచి వన్డే సిరీస్

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి ఖేల్ ప్రతినిధి) : న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం భారత జట్టును శనివారం ప్రకటించనున్నారు. దీని కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. సౌతాఫ్రి కాతో సిరీస్ తర్వాత టీమిండియాకు 3 వారాల రెస్ట్ దొరికింది. అయినప్పటకీ పలువురు భారత క్రికెటర్లు విజయ్ హజా రే ట్రోఫీలో బిజీగా ఉన్నారు. ఈ దేశవాళీ టోర్నీలో ప్రదర్శనను కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోనుండడంతో జట్టులో పలు మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కెప్టెన్ శుభమన్ గిల్ రీఎంట్రీ ఖాయమైంది. మెడనొప్పితో సౌతాఫ్రికా సిరీస్ మధ్యలోనే తప్పుకున్న గిల్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్నాడు.

దీం తో కివీస్ తో సిరీస్ ద్వారా మళ్లీ జట్టు పగ్గాలు అందుకుంటాడు. శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండగా.. రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ కుమార్ రెడ్డిలకు చోటు ఖాయం. స్పిన ఆల్ రౌండర్ కోటాలో జడేజా, వాషింగ్టన్ సుందర్ లకు చోటు దక్కనుంది. బుమ్రాకు రెస్ట్ ఇస్తుండడంతో పేస్ ఎటాక్ లో అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా చోటు దక్కించుకునే అవకాశముంది. 

ఇదిలా ఉంటే వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కు చోటు దక్కే అవకాశాలు లేనట్టే. పంత్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. గతేడాది చాంపియన్స్ ట్రోఫీ, సౌతాఫ్రికాతో సిరీస్ కోసం ఎంపికైనప్పటకీ పంత్కు ఫైనల్ ఎలెవన్లో ఆడే ప్లేస్ లేకుండా పోయింది. రుతురాజ్ నాలు గో ప్లేస్లో ఆడటం వల్ల పంత్కు ఛాన్స్ రాలేదు. 2018లో అరంగేట్రం చేసినప్పట్నించి పంత్ కేవలం 31 వన్డేలు మాత్రమే ఆడాడు. కొవిడ్కు ముందు 11, తర్వాత 15 వన్డేలు ఆడిన పంత్ ఆ తర్వాత కారు ప్రమాదానికి గురయ్యాడు. అయితే ఆ టైమ్లో ఓ సెంచరీ, రెండు సార్లు 75 ప్లస్, ఓసారి 80కి పైగా స్కోర్లు చేశాడు. కానీ కారు ప్రమాదం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొలంబోలో ఒకే ఒక్క వన్డే ఆడినా పెద్దగా ఆకట్టుకోలేదు.

దీంతో వన్డే జట్టు వికెట్ కీపింగ్ రేసులో వెనుకబడ్డాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ ను సెలక్టర్లు వికెట్ కీపర్ బ్యాటర్ గా ఎంపిక చేశారు. ఇప్పుడు రాహుల్ తో పాటు ఇషాన్ కిషన్ కూడా పంత్ కు గట్టిపోటీనిస్తున్నాడు. జాతీయ జట్టుకు దూరమైన తర్వాత ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ లో అదరగొడుతున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 500 ప్లస్ పరుగులు చేయడం ద్వార టీ20 ప్రపంచకప్ కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటుతుండడంతో బ్యాకప్ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపుతున్నారు. ఇషాన్ చివరిసారిగా 2023లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ తరఫున ఆడాడు. 

కివీస్ తో వన్డే సిరీస్ కోసం మహ్మద్ షమీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. షమీ చివరిసారిగా గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. 2023 వన్డే ప్రపంచకప్ లో అద్భుతమైన బౌలింగ్ తో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచిన షమీని గాయాలు వెంటాడాయి. గాయం నుంచి కోలుకుని మళ్లీ ఫిట్ నెస్ సాధించినా అనుకున్న రీతిలో రాణించలేదు. ఫలితంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టూర్ లకు కూడా అతన్ని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అప్పుడు సెలక్టర్లపై విమర్శలు కూడా గుప్పించాడు. ఫిట్ గా లేకుంటే దేశవాళీ క్రికెట్ ఎలా ఆడతానంటూ ప్రశ్నించాడు. తర్వాత షమీ రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు విజయ్ హజారే ట్రోఫీల్లో రాణించి ఫామ్ అందుకున్నాడు.

దీంతో కివీస్ తో సిరీస్ కోసం అతన్ని పరిగణలోకి తీసుకునే ఛాన్సుంది. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అయిన షమీ- .. ఇప్పటివరకు ఆడిన 108 వన్డేల్లో 206 వికెట్లు తీశాడు. బుమ్రాకు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తుండడం కూడా షమీకి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్తో జరిగే వన్డేలకు హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజును కూడా తీసుకునే అవకాశం ఉంది.సిరాజ్ చివరిసారిగా 2025 అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన స్వదేశీ సిరీస్కు అతన్ని పక్కన పెట్టారు. ఇప్పడు కివీస్ తో సిరీస్ కు అవకాశమివ్వొచ్చు. కాగా జనవరి 11 నుంచి వడదోర వేదికగా ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 14న రాజ్ కోట్ వేదికగా రెండో వన్డే.. జనవరి 18న ఇండోర్ వేదికగా మూడో వన్డే జరుగుతాయి. జనవరి 21 నుంచి 31 వరకు న్యూజిలాండ్తోనే టీమిండియా ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.

సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఈ సిరీస్ కీలకంగా భావిస్తున్నారు. గత కొన్ని మ్యాచులుగా పేలవ ప్రదర్శన చేస్తున్న జడేజాకు ఇది చివరి అవకాశమని హింట్ ఇచ్చే ఛాన్సుంది. ఒకవేళ ఇక్కడ కూడా విఫలమైతే వాషింగ్టన్ సుందర్ శాశ్వతంగా ఆ స్థానాన్ని భర్తీ చేసే ఛాన్స్ ఉంది. అక్షర్ పటేల్ను కూడా రేసులో ఉన్నాడు. న్యూజీలాండ్ తో వన్డే సిరీస్ ముగిశాక ఐదు టీ20ల సిరీస్ ఉంది. ఇది ముగిశాక టీ20 వరల్ కప్ కూడా ఉంది.

ఈ నేపథ్యంలో రెండు కీలక టోర్నీలకు బుమ్రా, పాండ్యా గాయాలు కాకుండా అందుబాటులో ఉండాలంటే వీరిద్దరికీ వన్డేల నుంచి విశ్రాంతి నివ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే కివీస్ లో వన్డే సిరీస్ లో ఆడకుండా విశ్రాంతి ఇవ్వబోతున్నట్టు సమాచారం. అప్పుడే కివీస్ తో టీ20 సిరీస్ తో పాటు టీ20 వరల్ కప్ లోనూ వీరిద్దరి సేవల్ని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవచ్చని బీసీసీఐ భావిస్తోంది.  కాగా జనవరి 11 నుంచి వడదోర వేదికగా ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 14న రాజ్ కోట్ వేదికగా రెండో వన్డే.. జనవరి 18న ఇండోర్ వేదికగా మూడో వన్డే జరుగుతాయి. జనవరి 21 నుంచి 31 వరకు న్యూజిలాండ్తోనే టీమిండియా ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.

భారత జట్టు అంచనా 

గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్ నెస్ ఆధారంగా), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జైస్వాల్, కేఎల్ రాహుల్ , రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ కుమార్ రెడ్డి, జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా, సిరాజ్