calender_icon.png 24 January, 2026 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇషాన్, సూర్య ఊచకోత

24-01-2026 12:53:39 AM

టీ20 ప్రపంచకప్‌కు తన సెలక్షన్ సరైనదేనని నిరూపిస్తూ ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. బంతి వేయడమే ఆలస్యం బౌండరీనే టార్గెట్‌గా షాట్లు బాదేశాడు. బౌలర్ ఎవరన్నది అనవసరం.. తాను కొట్టేది సిక్సర్లే అంటూ రెచ్చిపోయాడు. కివీస్ బౌలర్లను ఇష్టమొచ్చిమనట్టు ఆడుకున్న ఇషాన్ కిషన్ మ్యాచ్‌ను వన్‌సైడ్‌గా మార్చేశాడు. తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో. భారీ లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. సిరీస్‌లో 2 ఆధిక్యాన్ని అందుకుంది.

  1. రాయ్‌పూర్‌లో భారత్ విధ్వంసం
  2. రెండో టీ20లో ఘనవిజయం
  3. సిరీస్‌లో భారత్‌కు 2 ఆధిక్యం
  4. సొంతగడ్డపై వందో టీ20 గెలుపు

రాయ్‌పూర్, జనవరి 23 : తొలి మ్యాచ్ గెలిచిన జోష్‌లో ఉన్న భారత్ రెండో మ్యాచ్‌కు తుది జట్టులో రెండు మార్పులు చేసింది. అక్షర్ పటేల్ గాయంతో దూరమవగా.. బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. వీరిద్దరి స్థానాల్లో కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణాలకు చోటు దక్కింది. పిచ్ పరిస్థితి, మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

గత మ్యాచ్ లో ఓడిన న్యూజిలాండ్ రాయ్ పూర్ లో మాత్రం ఎదురుదాడికి దిగింది. ఆ జట్టు బ్యాటర్లు భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. కివీస్ ఓపెనర్ల దెబ్బకు తొలి ఓవర్లోనే అర్షదీప్ సింగ్ 18 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక్కడ నుంచీ న్యూజిలాండ్ పరుగుల ప్రవాాహం గట్టిగానే కొనసాగింది. కాన్వే(18), స్టీఫెర్ట్ (24) రన్స్ కు పవర్ ప్లేలోనే ఔటయ్యారు. అయితే వికెట్లు పడుతున్నా కివీస్ స్కోర్ వేగం తగ్గలేదు.

రచిన్ రవీంద్ర మెరుపు బ్యాటింగ్ తో అదరగొట్టాడు. కేవలం 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్  2 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. అయితే గ్లెన్ ఫిలిప్స్ (19), మిచెల్ (18), చాప్ మన్ (10) పరుగులకు ఔటవడంతో కివీస్ 200 లోపే స్కోరు చేస్తుందనిపించింది. కానీ చివర్లో మిఛెల్ శాంట్నర్ దుమ్మురేపాడు. కేవలం 27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 47 పరుగులు చేశాడు. కివీస్ బ్యాటర్ల జోరుకు భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, హార్థిక్ పాండ్యా ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ అర్షదీప్ సింగ్ ఏకంగా 53 పరుగులిచ్చాడు. భారీ లక్ష్యఛేదనలో భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వెంటవెంటనే ఔటయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

జాతీయ జట్టుకు దూరమైన తర్వాత దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారించిన ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ తో పాటు సూర్యకుమార్ కూడా ఫూర్తి ఫామ్ లోకి వచ్చేశాడు. వీరిద్దరూ చెరొక ఎండ్ లో కివీస్ బౌలర్లను ఉతికారేశారు. ఫలితంగా మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది. ఇషాన్ కిషన్ 36 బంతుల్లో 76 (11 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. తర్వాత సూర్యకుమార్ యాదవ్, శివబ్ దూబేతో కలిసి మ్యాచ్ ను ముగించాడు.

ఈ క్రమంలో దాదాపు ఏడాది తర్వాత హాఫ్ సెంచరీ సాధించాడు. సూర్యకుమార్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత సూర్యకుమార్ మరింతగా రెచ్చిపోయాడు. చాలాకాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చానన్న ఆనందంతో విరుచుకుపడ్డాడు. సూర్యకుమార్ 37 బంతుల్లో 82 (9 ఫోర్లు, 4 సిక్సర్లు) రన్స్ చేశాడు. అటు దూబే(36) కూడా మెరుపులు మెరిపించాడు. ఫలితంగా భారత్ 15.2 ఓవర్లలోనే టార్గెట్‌ను అందుకుంది.  తద్వారా ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

స్కోరు బోర్డు

న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 208/6 ( శాంట్నర్ 47 నాటౌట్, రచిన్ రవీంద్ర 44, స్టిఫెర్ట్ 24; కుల్దీప్ యాదవ్ 2/35, పాండ్యా 1/25, హర్షిత్ రాణా 1/35)

భారత్ ఇన్నింగ్స్: 209/3 (15.2 ఓవర్లు) ( సూర్యకుమార్ 82 నాటౌట్, ఇషాన్ కిషన్ 76, శివమ్ దూబే 36 నాటౌట్ ;  సోధీ 1/34, డఫీ 1/38)