18-06-2025 12:45:30 AM
- గాజాలో ఆహారం కోసం వేచి చూస్తున్న సమయంలో ఘటన
- 51 మంది మృతి.. 200 మందికి పైగా గాయాలు
గాజా, జూన్ 17: ఇరాన్తో యుద్ధం చేస్తూనే ఇజ్రాయెల్ మరోవైపు గాజాను వదిలిపెట్టడం లేదు. తాజాగా మంగళవారం గాజా స్ట్రిప్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనా శరణార్థులు ఐక్యరాజ్యసమితి, వాణిజ్య ట్రక్కు ల్లో వస్తున్న ఆహారం కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ బల గాలు వారిపై కాల్పులకు తెగబడడంతో 51 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
అయితే ఈ కాల్పులను ఇజ్రాయెల్ సైన్యం సమర్థించుకోవడం గమనా ర్హం. ఆహార కేంద్రానికి నిర్దిష్ట మార్గంలోనే రావాలని సూచించామన్నారు. అయితే ఆహారం చేజెక్కించుకోవాలన్న ఆతృతలో పలువురు ఈ మార్గం నుంచి పక్కకు వెళ్తుండటంతోన వారిని అదుపు చేయడానికి సైన్యం కాల్పులు జరిపిందని టెల్ అవీవ్ సైనిక కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడడంతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ల మద్దతు ఉన్న దాతృత్వ సంస్థ, గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్) పాలస్తీనియులకు ఆహారం సరఫరా చేసే కేంద్రాలను ఏర్పాటు చేసింది.