హెచ్ఐవీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, జూలై 31 (విజయక్రాంతి): జిల్లాను హెచ్ఐవీ రహితంగా తీర్చిదిద్దడమే మన అందరి ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవీ నియంత్రణ కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బాధితులకు, అనుమానితులకు హెచ్ఐవీ, సిఫిలిస్, హెపటైటిస్-బి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. బాధితులకు క్రమం తప్పకుండా ఉచిత ఏఆర్టీ మందులు అందించాలన్నారు. అంతర్జాతీయ లక్ష్యమైన ’95-95-95’ సాధనకు అందరు శ్రమించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన, అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ ఈశ్వర్ రాజ్, ఏఆర్టీ వైద్యురాలు డాక్టర్ పద్మిని ప్రియదర్శిని, డీఏపీసీయూ, ఐసీటీసీ , డీఎస్ఆర్సీ, ఏఆర్టీ, టీఐ, ఎల్డబ్ల్యూఎస్, సీఎస్సీ, మాస్ సిబ్బంది పాల్గొన్నారు.






