calender_icon.png 6 June, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కరితో ముడిపెట్టడం సరికాదు

27-05-2025 12:06:08 AM

  1. మీడియా ఇష్టం వచ్చినట్టు రాస్తోంది.. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు 

ఇండస్ట్రీలో ఏ విభాగంలోనూ ఏకాభిప్రాయం ఉండదు 

నిర్మాతలు, ఎగ్జిబిటర్లు చర్చించుకుంటే సమస్య పరిష్కారం అయినట్టే

టాలీవుడ్‌లో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు స్పందించారు. ఈ విషయమై ఆయన సోమవారం విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సం దర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. “పర్సంటేజీల విషయంలో ఎగ్జిబిటర్లకు కొన్ని ఇబ్బందులున్నాయి. ఏప్రిల్‌లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ అంశాన్ని మా దృష్టికి తెచ్చారు.

గత ఆర్నెల్లుగా వస్తున్న రెవెన్యూ గురించి ఈ సందర్భంగా వారిని అడిగాం. పర్సంటేజీ విధానం ఉంటే బాగుంటుందని వారు చెప్పారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ లేదా పర్సంటేజీ విధానం నడుస్తోంది. మొదటి వారం బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాం. సెకండ్ వీక్ కలెక్షన్లు తగ్గగానే పర్సంటేజీ ఇస్తున్నాం. అది వాళ్లకు కష్టమైనదే. అది మా అందరికీ తెలుసు. దీనిపై చర్చిస్తున్నాం. కానీ, ఓ కొలిక్కి రాలేదు. 

సరిగ్గా అదే సమయంలో ‘హరిహరవీరమల్లు’ విడుదల తేదీని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. తర్వాత డేట్‌ను వాళ్లు లాక్ చేయలేదు. పర్సంటేజీ సమస్య తూర్పుగోదావరి నుంచి మొద లై నైజాంకు కూడా వచ్చింది.

నైజాంలో 370 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే, ఎస్వీసీఎస్ సహా మా వద్ద ఉన్న థియేటర్లు 30 మాత్రమే. ఏషియన్, సురేశ్ కంపెనీలో 90 ఉన్నాయి. 250 థియేటర్లను యజమానులో, లేదా వారికి సంబంధించిన వారో నడుపుతున్నారు. ‘ఆ నలుగురు’ అంటూ మీడియా ఇష్టం వచ్చినట్టు రాస్తోందని ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నాం. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. ఇప్పుడు క్లారిటీ తీసుకోండి. 

పర్సంటేజీ అంశం తెలంగాణకు వచ్చినప్పుడు ఇక్కడి ఎగ్జిబిటర్లు శిరీష్ దృష్టికి తీసుకొచ్చారు. 20 ఏళ్ల నుంచి ఆ ఎగ్జిబిటర్లతో మాకు వ్యాపార అనుబంధం ఉంది. మే 18న ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. వాళ్ల సమస్యలు, డిమాండ్లను నిర్మాతలకు చెప్పమని నేను సూచించాను.  డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో మీడింగ్ పెట్టాలని, ఒకవేళ ఆ సమావేశంలో తమ డిమాండ్లు నెరవేరకపోతే థియేటర్లు బంద్ చేస్తామని మాత్రమే చెప్పా రు.

అసలు మీటింగ్ జరగకుండా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అంటూ మీడియాలో బ్రేకింగ్‌లు వేయడం ఎంతవరకూ సమంజసం. ఈ వార్తలను అటు ఎగ్జిబిటర్లు, ఇటు ఛాంబర్ ఖండిచలేదు. ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదే. అంతా కలిసి మాట్లాడాలంటే మాకు భయం. ఇటీవల నిర్మాతలం అందరం కలిసి ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించాం. పరిష్కారం చూడాలనుకున్నాం. ఈలోగా ఈ ఎపిసోడ్ మరోవైపు మలుపు తిరిగింది.

పవన్‌కల్యాణ్ నటించిన ‘హరిహరవీరమల్లు’ విషయంలో తప్పుగా వెళ్లింది. ఆయన సినిమాలను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. ప్రభుత్వానికి కూడా ఆ సమాచారాన్ని తప్పుగా చెప్పారు. ఏపీ మంత్రి దుర్గేశ్ నాకు ఫోన్ చేస్తే థియేటర్లు మూసివేయరని స్పష్టంగా చెప్పాను.

తప్పుడుగా సమాచారం వచ్చిందని ఆయనకు వివరించాను. మే 30న భైరవం, జూన్ 5న థగ్‌లైఫ్, జూన్ 12న హరిహరవీరమల్లు, జూన్ 20న కుబేర, జూలై 4న కింగ్‌డమ్ ఇలా జూన్, జూలై నెలల్లో పెద్ద సినిమాలున్నాయి. ఈ సమయంలో సినీ పరిశ్రమను ఎలా కాపాడుకోవాలనేదే మా అందరి  తపన. 

జూన్, జూలై, ఆగస్టు సినిమాలకు కీలక సీజన్. తూర్పుగోదావరిలో ఓ వ్యక్తితో మొదలైన సమస్యను తెలంగాణకు ఆపాదించారు. సినిమా వాళ్లకు రెండు ప్రభుత్వాలు చాలా ముఖ్యం. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండాలనే సీఎం రేవంత్‌రెడ్డి నన్ను ఎఫ్‌డీసీ చైర్మన్‌గా పెట్టారు.

పవన్‌కల్యాణ్ పెద్దన్నలాంటి వారు. ఆయన తిడితే పడతాం. పవన్ హర్ట్ అయ్యారు.. అందుకు మమ్మల్ని తిట్టే అధికారం ఆయనకుంది. ఆయనకు కోపం వచ్చేలా పరిస్థితు లు చోటుచేసుకున్నాయి. ఆయన చిత్రాన్నే టార్గెట్ చేశారంటూ నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ, జరిగింది అది కాదు.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని హెడ్‌లైన్స్ పెట్టడమే ప్రధాన సమస్య. 

ఇప్పుడే కాదు ఇండస్ట్రీలో ఏ విభాగంలోనూ ఏకాభిప్రాయం ఉండదు. అందరం కలిసి ఐక్యంగా ఉండాలనే ఆలోచన మా ఇండస్ట్రీలో ఉండదు. ఎవరికి సినిమా వచ్చినప్పుడు వాళ్లు మేల్కొని, టికెట్ ధరలు పెంచుకునేందుకు పెరిగెత్తుకుంటూ వెళ్తారు. నిర్మాతల విషయంలో ఇండస్ట్రీ తరఫున వెళ్లాల్సింది ఛాంబర్. నటుల విషయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా). ఎఫ్‌డీసీ ద్వారా అపాయింట్‌మెంట్ కోరాం.

కానీ, ఇంకా ఖరారు కాలేదు. సినిమాలను నిర్మించేవారు 10 నుంచి 20 మందే యాక్టివ్‌గా ఉన్నారు. వారి సమస్యలు వారికే తెలుస్తాయి. కాబట్టి కౌన్సిల్‌లో మాట్లాడినా.. ఛాంబర్‌లో మాట్లాడినా సమస్యలకు పరిష్కారం లభించకపోవచ్చు అనే ఉద్దేశంతోనే  గిల్డ్‌ను ప్రారంభించారు. వర్కింగ్ కమిటీ, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కమిటీ.. ఇలా గిల్డ్‌లో రెండున్నాయి. నిర్మాలకు సంబంధించిన విషయాలే అక్కడ చర్చిస్తారు.

నేను ఛాంబర్ ప్రెసిడెంట్ నుంచి నిరుడు ఎఫ్‌డీసీ చైర్మన్ అయ్యా. కాబట్టి నా ఫోకస్ అంతా ఇప్పుడు ఎఫ్‌డీసీ పై ఉంది. మాకు ప్రాబ్లం ఉంటేనే మేం ఛాంబర్‌కు వెళతాం. రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అండగానే ఉన్నాయి. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా, ప్రభుత్వాలే పరిష్కరించాలి” అని దిల్ రాజు అన్నారు.