14 July, 2026 | 4:26 AM

కాంగ్రెస్‌లో ‘జక్కిడి’ మంటలు

14-07-2026 12:47 AM
  1. మహిళా నేత, యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మయాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు 
  2. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డిపై ఆగ్రహం 
  3. ఎల్బీనగర్‌లో భగ్గుమన్న బీసీ సంఘాల ఆందోళన
  4. విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో
  5. శివచరణ్‌రెడ్డి ఇంటి ముట్టడి, పోలీసుల లాఠీఛార్జి 
  6. క్షమాపణ చెప్పకుంటే గాంధీ భవన్ ముట్టడిస్తామని హెచ్చరిక
  7. పార్టీ నుంచి శివచరణ్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్
  8. కుట్రపూరితంగా నా ఇంటిపై దాడి: జక్కిడి 

ఎల్బీనగర్, జూలై 13 (విజయక్రాంతి): బీసీ నాయకులపై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి చేసిన వ్యా ఖ్యల ఆడియో క్లిప్‌ంగ్ అంటూ బయటికి రావడంతో బీసీ సంఘాల భగ్గుమన్నాయి. యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు, ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరా బాద్ డివిజన్‌కు చెందిన ఈశ్వరమ్మ యాదవ్‌పై అసభ్య వ్యాఖ్యలు చేశారని బీసీ సంఘా ల నాయకులు ఆరోపించారు.

ఈశ్వరమ్మకు మద్దతుగా యాదవ, పద్మశాలీ, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు సోమవారం మ న్సూరాబాద్ డివిజన్‌లోని ఈశ్వరమ్మ ఇంటి వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  జక్కిడి శివచరణ్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించారు. శివచరణ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశా రు. అనంతరం శివచరణ్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు.

ఈ క్రమంలో శివచరణ్‌రెడ్డి, ఈశ్వ రమ్మ మద్దతుదారుల మధ్యన రాళ్లదాడి చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరువర్గాలను లాఠీఛార్జ్ చేసి, చెదరగొట్టారు. ముం దుగా జరిగిన సమావేశంలో బీసీ సంఘాల నాయకులు మాట్లాడారు. బీసీ సంఘాల నా యకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్‌పై శివచరణ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్రవర్ణాల దురహంకారానికి నిదర్శనమన్నారు.

రెడ్డి నాయకులు బీసీ నాయకులను రాజకీయం గా ఎదగకుండా మానసికంగా, పార్టీపరంగా వేధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే జక్కిడి శివచరణ్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్దఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టి పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో శివచ రణ్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

క్షమాపణ చెప్పకపోతే గాంధీ భవన్ ముట్టడిస్తామన్నారు. సీనియర్ నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి చిన్న నామినేటెడ్ పదవి ఇస్తే కాంగ్రెస్‌లోని ఓసీ నాయకుడు ఓర్వలేరా అని ప్రశ్నించారు. ధర్నాతో 10 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 

కుట్రపూరితంగా దాడి చేశారు: జక్కిడి శివచరణ్‌రెడ్డి

ఈశ్వరమ్మ యాదవ్‌పై అసభ్య వ్యాఖ్యలు చేశానంటూ తనపై వచ్చిన ఆరోపణలపై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి స్పందించారు. సోమవారం తన నివాసంలో శివచరణ్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో తన ఎదుగుదలను ఓర్వలేక తనపై కుట్రపూరితంగా అనని మాటలను అన్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు.

బీసీ సంఘాల నాయకులు తన ఇంటిపై దాడి చేయడాన్ని ఖండించారు. ఈశ్వరమ్మ యాదవ్ మనుమడు, అతని అనుచరులు తన ఇంటిమీదకి వచ్చి, దాడి చేసి, యూత్ కాంగ్రెస్ నాయకులను గాయపరిచారని ఆరోపించారు. పార్టీ అంతర్గత విషయాలను కులాన్ని ఆపాదించి యాదవ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి ఆమె మనుమడు అనుచరులతో వచ్చి రాళ్ల దాడి చేశాడన్నారు. కొంత కాలంగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి తనపై అసత్య ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి మధుయాష్కీగౌడ్ నాపై జరిగిన దాడిని ఖండిచకపోవడమే గాక సినిమా చూస్తున్నట్లు చూడటం ఏమిటి అని ప్రశ్నించారు. కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడిని కలిసిదా డికి సంబంధించిన ఘటనలు వివరిస్తానని, నా మీద సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లపై, దాడి చేసిన ఈశ్వరమ్మ అనుచరుల మీద పోలీస్ కేసు పెట్టినట్లు శివచరణ్‌రెడ్డి తెలిపారు.