27-05-2025 05:22:52 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): సీనియర్ జర్నలిస్టు, కాలమిస్టు మునీర్(Senior journalist MD Muneer) మరణం పత్రికా రంగానికి, శ్రామిక వర్గానికి తీరనిలోటని వివిధ ప్రజా సంఘాల నాయకులు, పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం కొత్తగూడలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో స్వర్గీయ జర్నలిస్టు మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మండల అధ్యక్షుడు ఎస్.కె. సల్మాన్ పాషా(Mandal President S.K. Salman Pasha) మాట్లాడుతూ... గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మునీర్ తన ఊపిరి పోయేంతవరకు అనునిత్యం ప్రజా సమస్యలపై, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై, సింగరేణి కార్మికుల ఇబ్బందులపై పనిచేశారని కొనియాడారు.
ప్రజా సమస్యలపై తన కలంతో ప్రభుత్వాల తీరును ఎండగట్టారని, సింగరేణి ప్రాంతంలో మునీర్ మృతితో ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్టయిందన్నారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 10 వేల మంది జర్నలిస్ట్ లతో నిర్వహించిన సభకు మునీర్ అధ్యక్షత వహించారని గుర్తు చేశారు. ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ, జనం సాక్షి పత్రికలో బ్యూరో చీఫ్, కాలమిస్ట్ గా వ్యవహరించారని, హక్కుల సాధన కోసం సింగరేణి ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారన్నారు.
‘న్యూస్ ఈజ్ పీపుల్... పీపుల్స్ ఆర్ మై లైఫ్' అనే సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్న మునీర్... లేకపోవడం జర్నలిస్టు లోకానికి తీరని లోటని సల్మాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా నాయకులు శెట్టి పరశురాం, మహమ్మద్ అజ్మీర్, మండల ఉపాధ్యక్షులు గోగు విజయ్ కుమార్, తులం దెబ్బ మండల అధ్యక్షులు పూణెం సందీప్ కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి మిడతపల్లి యాకయ్య, పి వై ఎల్ నాయకులు రాయుడు, ముఖ్య సలహాదారుడు బొజ్జ సునీల్, మండల ప్రచార కార్యదర్శి రాకేష్ వర్మ, చాపల శ్రీనివాస్, నాంపల్లి రాజ్ కుమార్, ఈక నరేష్ , తాటి సుదర్శన్, దేవేందర్, వినయ్, దేసూ వెంకటేశ్వర్లు, అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.