జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 13 (విజయక్రాంతి): జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కె. హరితకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు టి. సురేందర్ రావు, ప్రధాన కార్యదర్శి పర్వతి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు పి. నాగేందర్, కోశాధికారి జె. లలిత్ కుమార్, సభ్యులు బి. కిరణ్ కుమార్, ముకశిర్ పాషా, ఎం. యాదగిరి, బి. వెంకన్న, పి. సంతోష్, ఎం.డి. ఇసాక్, ధనుంజయ్, జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






