అంకిరెడ్డి గూడెం సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
చౌటుప్పల్ జులై 13 : మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ లో దివీస్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులు రూ,98 లక్షల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులలో సర్పంచ్ మల్లేష్ గౌడ్ తెలంగాణ పంచాయితీ రాజ్ - 2018 చట్టాన్ని ఉల్లంఘించారని ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఆరోపించారు. సోమవారం గ్రీవెన్స్ డే లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా విధులను ఉల్లంఘన చేస్తూ, అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తమ అనుచరులకు మద్దుతు ఇస్తూ గ్రామ పంచాయతీ భూములను , రోడ్లను ఆక్రమించుకుంటున్నారని అన్నారు. ప్రజల ఆస్తులను కాపాడవలసిన సర్పంచ్ రోడ్డు ఆక్రమణకు ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. పలు అక్రమాలకు పాల్పడుతున్న అంకిరెడ్డిగూడెం సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
రోడ్డుపై అక్రమంగా నాటిన కడీలు తొలగించాలని ఆగిపోయిన గ్రామ సీసీ రోడ్డు పనులు పూర్తి చేసి , అభివృద్ధి పనులు పూర్తి చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వలందాసు మహేష్ , వార్డు సభ్యులు బత్తుల అనూష , పాలెం వెంకటేష్ , ముద్దం లింగస్వామి , దొడ్ల అండాలు , దండుగుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






