15-11-2025 01:41:14 AM
-ఎన్డీయేకు ప్రభం‘జనం’
-ఎన్నికల కమిషన్ను విమర్శిస్తే ఓట్లు పడవు
-మజ్లీస్ అండతో కాంగ్రెస్ గెలుపు
-జూబ్లీహిల్స్లో మేము ఎన్నడూ గెలవలేదు
-ఓటమిపై సమీక్షించుకుంటాం
-బీహార్, జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): బీహార్లో ఎన్డీయే ప్రభం జనం కనబడుతోందని, బీహార్ ప్రజ లు జంగిల్ రాజ్ మళ్లీ రావొద్దని కోరుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలి పారు. ఎన్డీయే ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధికి ప్రజలు పట్టం గట్టా రని, రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని వద్దనుకుని అభివృద్ధిని.. కోరుకున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ను విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడవన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తాము ఎన్నడూ గెలవలేదని, అయినా ప్రయత్నం చేశామని పేర్కొన్నారు. బీహార్, జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
నరేంద్రమోదీ నాయకత్వంలో.. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ద్వారా జరుగుతున్న పురోగతి ఇకపైనా కొనసాగించాలని బీహార్ ప్రజలు నిశ్చయించుకున్నారన్నారు. అందుకే ఎన్డీయేకు బంపర్ మెజారిటీ ఇచ్చారని, సర్వే సంస్థలు కూడా ఎన్డీయే ప్రభుత్వం ఈ స్థాయిలో సీట్లు గెలుస్తుందని ఊహించలేదన్నారు. దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో ముందుకెళ్తోందని, దీని ఫలితమే.. బీహార్ ఎన్నికల ఫలితాలని వెల్లడించారు. హర్యానా, తర్వాత మహారాష్ర్ట, ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రజలు మంగళం పాడేశారని నిరూపితమైందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఇప్పుడున్న 3 రాష్ట్రాలు కూడా.. చేజారిపోవడం ఖాయమన్నారు.
ఎన్నికల కమిషన్ను విమర్శిస్తే.. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడవనే విషయాన్ని అర్థం చేసుకోవాలని, దేశంలో అక్రమంగా ఉన్న ఓట్లను తొలగించడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని, కానీ ఈ పద్ధతే సరైనదని ప్రజలు అంగీకరించారని పేర్కొన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, తర్వాత క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్లు ఈ ప్రక్రియలో భాగస్వాములవుతారని, దీనికి మోదీ సంబంధేమేంటి? రాహుల్ గాంధీకి చాలా విషయాలు తెలియక అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల అధికారులకు, దేశ ప్రజలకు ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మేం ప్రయత్నించాం..
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తాము ఏనాడూ గెలవలేదని, కార్పొరేటర్ ఎన్నికల్లోనూ తాము ఈ ప్రాంతంలో గెలవలేదని, అయినా ప్రయత్నం చేశామని కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుంది కాబట్టి.. బాధ్యత తీసుకుని ఎక్కువ కష్టపడ్డామని, రాజకీయ పార్టీగా తాము చేయాల్సిన పనిని చేశామని, ఫలితాన్ని సమీక్షించుకుంటామని చెప్పారు. మరింత కష్టపడి పనిచేస్తామని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలుచుకునే దిశగా పనిచేస్తామన్నారు.
మజ్లిస్ అండతో కాంగ్రెస్ గెలిచిందని, సహజంగా ఉపఎన్నికల్లో రాష్ర్టంలో అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని, ఇది రేవంత్ పాలనకు రెఫరెండం కాదనే విషయాన్ని ఎన్నికలకు ముందే చెప్పానన్నారు. బీజేపీ ఇండిపెండెంట్ గానే ఉంటుందని, తప్పుడు ప్రచారం చేసి సాధించేదేమీ ఉండదన్నారు. బీఆర్ఎస్-, కాంగ్రెస్ రూ.కోట్లు పంచాయని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. పోలింగ్ బూత్ ఎదుట.. ఎన్నికలకు ఒకరోజు ముందు కోట్లు పట్టుబడ్డాయని, దీనికి బాధ్యులెవరో తెలియదా? అందుకే కాంగ్రెస్ గెలిచిందని కిషన్రెడ్డి విమర్శించారు.
నాడు 57 స్థానాల్లో మంచి ఫలితాలు..
ఈవీఎంలు బీహార్లో పనిచేయలేదా? లేక జూబ్లీహిల్స్లో మాత్రమే సరిగ్గా పనిచేశాయా? అనే ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాలని నిలదీశారు. బీజేపీకి రాష్ర్టంలో సానుకూల పవనాలు వీస్తున్నాయని, ఇందులో సందేహం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో.. 8 అసెంబ్లీ సీట్లు గెలిచిన మేం.. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి.. 8 ఎంపీ స్థానాల్లో గెలిచామని, పార్లమెంటు ఎన్నికల ఫలితాల ఆధారంగా.. 57 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని అన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. మూడింట్లో రెండుచోట్ల గెలిచామని, అది కూడా గ్రామీణ ప్రాంతాల్లోని యువత, టీచర్లు కలిసి ‘మమ్మల్ని గెలిపించారు’ అని అతెలిపారు. రానున్న రోజుల్లో రాష్ర్టంలో బీజేపీ మరింత విస్తరిస్తుందని కిషన్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.