12-01-2026 01:12:49 AM
ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
కామారెడ్డి, జనవరి 11: రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో నూతనంగా నియమితులైన చైర్మన్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరై, ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. నేను పుట్టింది, పెరిగింది ఈ శ్రీ కాలభైరవ స్వామి చెంతనే. పుట్టిన నేలకు సేవ చేసే అదృష్టం అందరికీ రాదు. ఆ అదృష్టం నాకు లభించింది.
నా చేతుల మీదుగా ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం జరగడం ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు. దక్షిణ కాశిగా పేరొందిన ఈ ఆలయ అభివృద్ధి కోసం తొలిసారిగా అసెంబ్లీలో గళం విప్పి మాట్లాడానని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి మన అందరి బాధ్యత అని, కమిటీ సభ్యులు నిత్యం ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, ఆలయ సంప్రదాయాలు, కట్టుబాట్లను కాపాడాలని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన చైర్మన్కు కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.