07-11-2025 12:00:00 AM
అక్షర్ పటేల్ ఆల్రౌండ్ షో
దెబ్బకొట్టిన దూబే, సుందర్
సిరీస్లో భారత్కు 2 ఆధిక్యం
గోల్డ్కోస్ట్, నవంబర్ 6 : ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా షార్ట్ ఫార్మాట్లో అదరగొడుతోంది. రెండో టీ ట్వంటీలో ఓడిపోయి వెనుకబడినప్పటకీ..తర్వాత వరుసగా రెండు విజయాలతో ఆధిక్యంలో నిలిచింది. తాజాగా గోల్డ్కోస్ట్ వేదికగా జరిగిన నాలుగో టీ ట్వంటీలో కంగారూలను చిత్తు చేసింది. 48 పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టును దెబ్బకొట్టింది.
ముఖ్యంగా అక్షర్ పటేల్ ఆల్రౌండ్ షో(21 రన్స్, 2/20)తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. అటు ఆసీస్ జట్టులోకి మాక్స్వెల్, జంపా, ఫిలిప్పీ, డ్వార్షియస్ వచ్చారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు తొలి వికెట్కు హాఫ్ సెంచరీ పార్టనర్షిప్ నమోదు చేశారు.అభిషేక్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
28 పరుగులకు ఔటవగా.. గిల్ ఆచితూచి ఆడుతూ సింగిల్స్కే పరిమి తమయ్యాడు. ఫామ్ అందుకునేందుకు అతను నిదానంగా ఆడడంతో అనుకున్నంత వేగంగా పరుగులు రాలేదు. అయితే వన్డౌన్ శివమ్ దూబేను పంపించన ప్రయోగం ఓ మాదిరిగా ఫలితాన్నిచ్చింది. దూబే 22 పరుగులకు ఔటవగా.. గిల్ 46 (39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) రన్స్ చేశాడు. సూర్యకుమార్ వచ్చీరావడంతోనే రెండు భారీ సిక్సర్లు బాదినా 20 పరుగులకే ఔటయ్యాడు.
తర్వాత తిలక్ వర్మ(5), జితేశ్ శర్మ(3) పరుగులకు ఔటవగా.. వాషింగ్టన్ సుందర్ (12), అర్షదీప్సింగ్ డకౌటయ్యారు. చివర్లో వరుస వికెట్లు కోల్పోయినప్పటకీ.. అక్షర్ పటేల్ 21 (11 బంతుల్లోనే 1 ఫోర్,1 సిక్సర్) మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, ఆడమ్ జంపా 3 వికెట్లు పడగొట్టారు.
168 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు మిఛెల్ మార్ష్, షార్ట్ తొలి వికెట్కు 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పవర్ ప్లేలోనే స్పిన్నర్ల ఎంట్రీతో ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్కరూ రాణించలేదు. పేస్ ఆల్రౌండర్ దూబే ఒకవైపు, స్పిన్నర్లు అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్ మరోవైపు చెలరేగడంతో ఆసీస్కు కష్టాలు తప్పలేదు.
ఇంగ్లీస్ (12), టిమ్ డేవిడ్(14) ఫిలిప్పే(10)నిరాశపరిచారు. దాదాపు 2 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మాక్స్వెల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి అతన్ని క్లీన్ బౌల్డ్ చేయగా.. చివర్లో వాషింగ్టన్ సుందర్ ఆసీస్ టెయిలెండర్ల పని పట్టాడు. దీంతో ఆస్ట్రేలియా కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో సుందర్ (3/3), అక్షర్ పటేల్ (2/20), దూబే (2/20) రాణించారు.
అర్షదీప్ , బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. 21 రన్స్తో పాటు 2 వికెట్లు తీసిన అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్లో చివరి టీ ట్వంటీ శనివారం బ్రిస్బేన్లో జరుగుతుంది.
స్కోర్లు :
భారత్ ఇన్నింగ్స్ : 167/8 (గిల్ 46, అభిషేక్ 28, అక్షర్ పటేల్ 22 నాటౌట్ ; ఎల్లిస్ 3/21, జంపా 3/45)
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : 119 ఆలౌట్ ( మార్ష్ 30, షార్ట్ 25, స్టోయినిస్ 17; సుందర్ 3/3, అక్షర్ పటేల్ 2/20, దూబే 2/20)