28-05-2025 01:07:45 AM
మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘కన్నప్ప’. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు మోహన్బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతలోనే ‘కన్నప్ప’ను మరో సమస్య చుట్టిముట్టింది.
ఈ సినిమాలోని కీలక సన్నివేశాలకు సంబంధించిన హార్డ్డ్రైవ్ను అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్కుమార్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు.
కన్నప్ప చిత్రానికి కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్డ్రైవ్ను ముంబయిలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ వారు డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిల్మ్నగర్లోని విజయ్కుమార్ కార్యాలయానికి పంపారు. ఈ పార్శిల్ను ఈ నెల 25న ఆఫీస్బాయ్ రఘు తీసుకున్నాడు. అతను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా హార్డ్డ్రైవ్ను చరిత అనే మహిళకు అప్పగించాడు. అప్పట్నుంచి వారు తప్పించుకు తిరుగుతున్నారు.
తమ ప్రాజెక్టుకు నష్ట కలిగించాలనే దురుద్దేశంతో రఘు, చరిత ఇలా చేస్తున్నారంటూ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫిల్మ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హార్డ్డ్రైవ్లో 1.30 గంటల సినిమా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ప్రభాస్కు సంబంధించిన కీలక యాక్షన్ సీక్వెన్స్ హార్డ్డ్రైవ్లో ఉన్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మంచు విష్ణుకు ఈ సమస్య తలనొప్పిగా మారడంతో దీంతో ఆ శివయ్యను ప్రశ్నిస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. ‘జటాజూటధారీ.. నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?’ #హరహరమహదేవ్ అంటూ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.