26-10-2025 04:53:35 PM
అర్బన్ బ్యాంక్ ను తీర్చిదిద్దుతాం..
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..
జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): ఎన్నికల్లో తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపిస్తే ఇతర బ్యాంకుల కంటే మరింత మెరుగ్గా అత్యుత్తమ బ్యాంకుగా కరీంనగర్ అర్బన్ బ్యాంకును తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. తమ ప్యానెల్ అభ్యర్థులు నీతిగా నిజాయితీగా సేవలందిస్తారని ఏలాంటి మచ్చలేని వారు తమ ప్యానల్ లో ఉన్నారని తెలిపారు. కరీంనగర్ తో పాటు జగిత్యాల ఓటర్ల అదనపు బలంతో తమ ప్యానెల్ కచ్చితంగా అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కార్యాలయంలో ఆదివారం వెలిచాల రాజేందర్ రావు అర్బన్ బ్యాంకు ప్యానల్ అభ్యర్థులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యానల్ అభ్యర్థులను పరిచయం చేశారు.
అనంతరం రాజేందర్ రావు మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మెరికల లాంటి ఇద్దరు యువకులు గాదె కార్తీక్, అనిల్ కుమార్ ను ప్రతిపాదించారని తెలిపారు. ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడంతో పాటు మంచి వ్యక్తులను ప్రతిపాదించడం 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందని రాజేందర్రావు సంతోషం వ్యక్తం చేశారు. గాదే కార్తీక్ తండ్రి గాదే వేణుగోపాల్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా పని చేశారని తెలిపారు. అనిల్ కుమార్ కౌన్సిలర్ గా పని చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సహకారంతో పాటు వీరిద్దరి కృషి వల్ల జగిత్యాల నియోజకవర్గం నుంచి 80% ఓట్లు తమ ప్యానెల్ సాధించడం ఖాయమన్నారు. అదేవిధంగా ఇటీవల మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు, విప్ ఆది శ్రీనివాస్ ప్యానల్ అభ్యర్థులకు ఆశీస్సులు అందజేశారని తెలిపారు. మంత్రులు విప్ ప్యానల్ గెలిచి రావాలని ఆశీర్వాదం అందించడం తమకు ఎంతో రెట్టింపు ఉత్సాహాన్ని బలాన్ని ఇచ్చిందని రాజేందర్ రావు చెప్పారు.
తమ ప్యానెల్ లో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న వారు ఉన్నారని అదేవిధంగా గతంలో అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్నవారు ఉన్నారని దీనికి తోడు కాంగ్రెస్ బావజాలం.. కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నవారు ఉండడం తమకు ఎంతో కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. గతంలో పనిచేసిన వారి పనితీరు తమ ప్యానెల్ అభ్యర్థుల వ్యక్తిత్వము ఆలోచన తీరు పనిచేసే విధానము నిజాయితీ ని చూసి అర్బన్ బ్యాంకు ఓటర్లు ఆశీర్వదించి పట్టంకట్టాలని వెలిచాల రాజేందర్రావు విజ్ఞప్తి చేశారు. తమ ప్యానల్ అభ్యర్థులతో అర్బన్ బ్యాంకు దశ దిశను మార్చి వేస్తామని ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు డిజిటలైజేషన్ సిస్టం ప్రవేశపెడతామని రాజేందర్రావు ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో తమ మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. గతంలో కొందరి ప్రమేయం వల్ల అవినీతి ఆరోపణలు అనేకం వచ్చాయన్నారు.
అర్బన్ బ్యాంకు డిపాజిటర్ల లో అభద్రత భావాన్ని పెంచేలా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. డిపాజిటర్లు ఇన్వెస్టర్లు భయాందోళనలు చెందేలా కొంతమంది వ్యవహరించారని పేర్కొన్నారు. స్వచ్ఛమైన నిజాయితీవంతమైన తమ ప్యానల్ అభ్యర్థులను అర్బన్ బ్యాంకు ఓటర్లు ఆదరించాలని కోరారు. అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒక్క ఛాన్స్ ఇస్తే అర్బన్ బ్యాంకు రూపురేఖలే మారుస్తామని అనేక సంస్కరణలు తీసుకొస్తామని రాజేందర్రావు హామీ ఇచ్చారు. ప్యానల్ అభ్యర్థులంతా పరిచయం చేసుకున్నారు. ఈ సమావేశంలో అర్బన్ బ్యాంకు ప్యానల్ అభ్యర్థులు మూల వెంకట రవీందర్ రెడ్డి, గాదె కార్తీక్, కూసరి అనిల్ కుమార్, ఇ లక్ష్మణ్ రాజు, అనురాసు కుమార్, వజీర్ అహ్మద్, ఉయ్యాల ఆనందం, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, మన్నె అనంత రాజు, మునిఫల్లి ఫణిత, దామెర శ్రీలత రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బట్టు వరప్రసాద్, అనంతుల రమేష్, కనకరాజు, పొన్నం మధు తదితరులు పాల్గొన్నారు.