లారీని ఢీకొట్టిన కావేరి ట్రావెల్స్ బస్సు.. ఎనిమిది మందికి గాయాలు
నందిగామ: ఎన్టీఆర్ జిల్లా(NTR district) నందిగామ వద్ద వేగంగా దూసుకొచ్చిన కావేరి ట్రావెల్స్ బస్సు లారీని ఓవర్ టేక్ చేయబోయి మరో లారీని(kaveri travels bus accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రావెల్స్ బస్సులో 20 మంది ప్రయాణికులున్నారని బాధితులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు బస్సు ఎడమ భాగం నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వరస బస్సు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే.




