07-12-2025 12:03:45 AM
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ గిరిజనులకు కేసీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ర్ట కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన గిరిజనుల ఆత్మబంధువు అనే పుస్తకాన్ని శనివారం కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలను, గూడాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి, గిరిజనుల జనాభా పెరిగిన దృష్ట్యా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించి, గిరిజనులకు పోడు భూములపై హక్కులను కల్పించే విధంగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి వాటికి రైతుబంధు పథకాన్ని వర్తింపజేయడం వంటి ఎన్నో ఏండ్ల గిరిజన కలల ను సాకారం చేసిన స్వాప్నికుడు కేసీఆర్ అని కొనియాడారు.
కేసీఆర్ సేవలను తండాలలో, గూడాలలో గిరిజన జాతి గుర్తుపె ట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. గిరిజన విద్యార్థుల కోసం గురుకులాలు, గిరి వికాస్, గిరి పోష ణ, హైదరాబాద్ నడిబొడ్డున ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వంటి వినూత్నమైన కార్యక్రమాలకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
గిరిజన తండాలు, గూడాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన రోజు ఆగస్టు 2వ తేదీని అన్ని గిరిజన గ్రామాలలో గిరిజన సంబుర కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. గిరిజన జాతి కోసం కేసీఆర్ చేసిన సేవలను పుస్తక రూపంలో తీసుకువచ్చిన రచయిత బీఆర్ఎస్వీ రాష్ర్ట కార్యదర్శి శ్రీను నాయక్ను ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు.