04-06-2025 12:28:00 AM
ముగ్గురు నిందితుల అరెస్ట్
సూర్యాపేట, జూన్ 3 (విజయక్రాంతి): నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు వాటిని విక్రయిస్తున్న మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి 308 కేజీల నకిలీ విత్తనాలు, వాటి తయారీకి వాడే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సూర్యాపేట పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరికి చెందిన సింగారపు యాదగిరిస్వామి తిరుమలగిరి శివారులో తన భూమి చుట్టూ ఉన్న వారి భూములు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు.
ఈ క్రమం లో పత్తి పంట ఎక్కువ దిగుబడి రాకపోవడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని అత్యాశతో యూట్యూబ్లో పత్తి గింజలు తయారు చేసే వీడియోలను చూశాడు. నకిలీ పత్తి విత్తనాలు తయారు చేయడానికి కావలసిన 3 ఫేజ్ హాప్ హెచ్పీ మోటార్లు, దానిని కలపడానికి డ్రమ్ము లు, సల్ఫ్యూరిక్ యాసిడ్ క్యానులు, పత్తి గింజలు రంగు రావడానికి షైన్ స్టార్ డబ్బాలు తీసుకవచ్చి, ఎవ్వరికీ అనుమానం రాకుండా అతను లీజుకు తీసుకున్న వ్యవసాయ భూమి వద్ద ఉంచాడన్నారు.
అప్పటికే తాను పండించిన పత్తి నుంచి గింజలు వేరు చేసి వాటి నుంచి 308 కేజీల పత్తి విత్తనాలు తయారు చేసి ఒరిజినల్ బీటీ విత్తనాలుగా నమ్మబలికాడు. వాటిని తనకు పరిచయం ఉన్న నందాపురం గ్రామానికి చెందిన లొడంగి నవీన్, యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు గ్రామానికి చెందిన సోమ నారాయణలతో కంపెనీకి కన్నా తక్కువ రేటుకు అమ్ముతానని చెప్పాడు.
వాటిని తీసుకెళ్లి ఎక్కువ రేటుకు అమ్ముకోండని విక్రయించాడు. దీనికి సంబంధించి పక్కా సమాచారంతో తిరుమలగిరి పోలిసులు నిందితుల వ్యవసాయ భూముల వద్ద, ఇండ్లలో దాడి నిర్వహించగా నకిలీ పత్తి విత్తనాలతో పాటు, వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన పరికరాలు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అదుపులోకి కేసు నమోదు చేశారు.