17-06-2025 12:05:25 AM
ముగ్గురి అరెస్ట్
హుస్నాబాద్, జూన్ 16 : నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్న ఒక ముఠా గుట్టును సిద్దిపేట పోలీసులు రట్టు చేశారు. బెజ్జంకి మండలంలో చేపట్టిన ఆపరేషన్లో భాగంగా 160 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్టు సిద్దిపేట టాస్క్ఫోర్స్ ఏసీపీ రవీందర్ మీడియాకు తెలిపారు.
ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు బెజ్జంకి ఎడ్లబండి చౌరస్తా వద్ద నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారం అందింది. దీంతో టాస్క్ఫోర్స్ ఏసీపీ రవీందర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్లు రమేశ్, జానకిరాంరెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, బెజ్జంకి ఎస్ఐ తిరుపతిరెడ్డి సిబ్బందితో బెజ్జంకి మండల వ్యవసాయ అధికారి బండ సంతోష్తో కలిసి వల పన్ని మంచిర్యాల జిల్లా, కోటపల్లి మండలం, సర్వాయిపేట గ్రామానికి చెందిన దుర్గం శేఖర్ (30)ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 4 కిలోల నకిలీ విడి పత్తి విత్తనాలు లభ్యం అయ్యాయి.
పాడుబడిన కేంద్రంలో నకిలీ విత్తనాల నిల్వ
శేఖర్ను లోతుగా విచారించగా, బెజ్జంకి గ్రామ శివారులోని పాడుబడిన ప్రభుత్వ పట్టు పురుగుల కేంద్రం వద్ద నకిలీ విత్తనాలను నిల్వ చేసినట్టు వెల్లడించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, నాలుగు బస్తాలలో ఉన్న 160 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
దుర్గం శేఖర్తో పాటు మరో ఇద్దరు నిందితులు కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఇనుకొల్లు వసంతరాంరెడ్డి(50), నంద్యాల జిల్లా కొండపల్లికి చెందిన కుందవరం ప్రభాకర్(50)ను అరెస్టు చేశారు. నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని వారిని జ్యుడీషియల్ రిమాండ్కు పంపారు. ఎవరైనా అనుమానాస్పదంగా విత్తనాలు అమ్ముతున్నా, నిల్వ చేస్తున్నా వెంటనే డయల్ 100కు లేదా సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీస్ అధికారుల ఫోన్ నంబర్లు 8712667445, 8712667446, 87126677447కు సమాచారం అందించాలని టాస్క్ఫోర్స్ ఏసీపీ రవీందర్ తెలిపారు.