నేడు బాధ్యతలు స్వీకరించనున్న కిషన్ రెడ్డి, బండి
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 9వ తేదీన కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వీరు ఢిల్లీలోని తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరిస్తారు. ఉదయం 9.45 గంటలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు.
ఆ తర్వాత గురుద్వార బంగ్లాసాహిబ్ను సందర్శిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు శాస్త్రి భవన్లోని ఏ బ్లాక్లో ఉన్న బొగ్గు, గనుల మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఉదయం 10.35 గంటలకు నార్త్ బ్లాక్లోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో బండి సంజయ్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి హాజరై బండికి ఆశీస్సులు అందిస్తారు.






