09-01-2026 08:02:26 PM
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ
రేగొండ,(విజయక్రాంతి): ఈ నెల చివరి లోగా కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి రెవెన్యూ, దేవాదాయ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్అండ్బి, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్తు శాఖల అధికారులతో దేవాలయ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 12వ తేదీలోగా అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అలాగే ఇప్పటికే చేపట్టిన పనులకు సంబంధించిన ఎంబి రికార్డును ఈ నెల 19 వ తేదీలోగా పూర్తి చేయాలని దేవాదాయ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. సమీక్షకు ముందు దేవాలయ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించి, పనుల నాణ్యత, వేగంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరిలో దేవాలయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని, ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి ఈఈకి సూచించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టిన అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు పనుల కొరకు ప్రతి పాదనలు, పూర్తి అయిన పనులకు ఎంబి రికార్డులను అందచేయాలని సూచించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్ నాయక్, పిర్ ఎస్ ఈ చక్రవర్తి, దేవాదాయశాఖ ఈఈ దుర్గ ప్రసాద్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ శ్వేత, ఆర్అండ్బి ఈఈ రమేష్, ఇరిగేషన్ ఈఈ బసవ ప్రసాద్, ఆర్డిఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, ఎఫ్డిఓ అప్పలకొండ, తహసీల్దార్ శ్వేతా, దేవస్థానం ఈఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు.