calender_icon.png 15 October, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభివృద్ధికి, అరాచకత్వానికి మధ్య పోరు: కేటీఆర్

15-10-2025 01:28:10 PM

హైదరాబాద్:  జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదు, ఈ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల ఎన్నిక కాదు.. పదేండ్ల అభివృద్ధి, పాలనకి.. రెండు సంవత్సరాల అరాచక కాంగ్రెస్ పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నికని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్‌కు వెళ్ళేముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కోసం తెలంగాణలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మాగంటి సునీత గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 ఇస్తుందని ఆశిస్తున్నారని తెలిపారు. లక్షల మంది రైతన్నలు సునీత గెలుస్తుందని ఆశిస్తున్నారు. ఆ తర్వాతే తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తర్వాత మోసపోయిన యువతి యువకులు చూస్తున్నారని తెలిపారు.

తమ ఇళ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని, ఆ అరాచకాలు ఆగాలని హైదరాబాద్ నగర పేదలు(Hyderabad city) చూస్తున్నారని, మూతపడుతున్న బస్తీ దవాఖానాలు, ఉచిత తాగునీరు ఆగిపోతున్న విషయాలు ప్రజలందరూ చూస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాదులో కట్టలేదని ఆరోపించిన కేటీఆర్, కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కట్టిన హైదరాబాద్‌లో కట్టిన లక్ష ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజలకు గుర్తున్నాయని సూచించారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వకుండా దారుణంగా అవమానపరిచిన మైనార్టీలు, ఈ ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తున్నారని చెప్పారు. తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్నీ మోసమని, ఈ అంశంలో గుణపాఠం చెప్పడానికి రాష్ట్రవ్యాప్తంగా బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. దళిత బంధు, అభయహస్తం అని చెప్పి మోసం చేసిన దళితులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) అభ్యర్థికి అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నదన్న కేటీఆర్,కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి పాలన రావడానికి, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక పునాది కాబోతున్నదని జోస్యం చెప్పారు. మరోసారి తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతుందని హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల మద్దతుతో, అండతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత(BRS Candidate Maganti Sunitha ) ఘన విజయం సాధించబోతున్నదన్నారు. రెండు సంవత్సరాల్లోనే విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి, నియోజకవర్గానికి విశేషమైన సేవలు అందించారని కొనియాడారు. హైదరాబాద్ నగరంలో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపొందిందంటే, అప్పటి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గోపీనాథ్ కృషి కూడా ఉందన్నారు. గోపీనాథ్ అకాల మరణంతో బాధపడుతున్న కుటుంబాన్ని అందరూ ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయించి, ఆయన సతీమణి సునీత గోపీనాథ్ కి టికెట్ కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. మాగంటి సునీతకి సహాయం కోసం పార్టీ కీలక నాయకులంతా పనిచేయాలని కేసీఆర్ ఆదేశించారు. అందరి ఆశీర్వాదాలతో సునీత ఎన్నికల్లో గెలువబోతున్నారని కేటీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు.