29-06-2025 11:39:51 PM
హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు గురించి కేంద్ర మంత్రి అమిత్షా(Union Minister Amit Shah)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఎక్స్ వేదికగా ప్రశ్నలతో ధ్వజమెత్తారు. తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏటీఎంలా మారిపోయిందని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన మీరు, మరి కేంద్ర హోం మంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పగలరా? అని ప్రశ్నించారు. కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీతో అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంపై విచారణ జరపడానికి కేంద్రానికి ఏం అడ్డు వస్తుందో తెలంగాణ ప్రజలకు వివరించగలరా..? ఢిల్లీలో కాంగ్రెస్తో బీజేపీ కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ అన్నట్టుగా సాగుతున్న కుమ్మక్కు రాజకీయాల వల్లే రేవంత్ను వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలకు సమాధానం ఉందా? అని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ ప్రజల గొంతుకై నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ను ఒంటరిగా ఎదుర్కోలేక, రేవంత్ను బీజేపీ పావుగా వాడుకుంటున్న మాట వాస్తవం కాదా? అని, గతంలో దేశ ప్రధాని మోదీ గారు వచ్చినప్పుడు, ఏకంగా రాహుల్-రేవంత్ కలిసి ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు కానీ దర్యాప్తునకు మాత్రం నేటికీ ఆదేశించలేదని అన్నారు. దేశ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి హోదాలో మీరు తెలంగాణకు వచ్చి కేవలం సీఎంపై అవినీతి ఆరోపణలు చేస్తే సరిపోతుందా? అని, పట్టపగలు ప్రజాధనం లూటీ చేస్తూ ఢిల్లీకి మూటలు పంపుతున్న కాంగ్రెస్ సీఎం అక్రమాలకు కేంద్ర అడ్డుకట్ట వేయలేదా? అని ప్రశ్నించారు.
మరోవైపు.. ధాన్యం దిగుబడిలో పంజాబ్నే తలదన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తెలంగాణ ఎదగడంలో కీలకపాత్ర పోషించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లడం అత్యంత దురదృష్టకరమని, ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా, ఇద్దరు కేంద్రమంత్రులున్నా, తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా, కనీసం ఒక్క ఐఐటీ, ఐఐఎం, మెడికల్ కాలేజీ వంటి ఉన్నత విద్యాసంస్థలు మంజూరు చేయకుండా బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని నాలుగు కోట్ల ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్ వివరించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు నయాపైసా కేటాయించకుండా.. పేరుకు పసుపు బోర్డు పెట్టి రిబ్బన్ కట్ చేస్తే ప్రయోజనమేంటని అన్నారు.
కనీసం సొంత భవనం కూడా కట్టకుండా.. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించడం సమంజసమేనా? అని తెలిపారు. అసలు ఒక్క పసుపు బోర్డును ఇన్నిసార్లు ప్రారంభించడం సబబేనా? ఈ జనవరి 14న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ వర్చువల్గా పసుపు బోర్డును ప్రారంభించేశారని కేటీఆర్ వెల్లడించారు. మరోసారి మీరు ఇవాళ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ప్రయోజనమేంటని ప్రశ్నించారు.
ఏపీలోని టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్లకు నదుల అనుసంధానం ముసుగులో కేంద్రం బంగారు బాటలు వేయడం.. గోదావరిపై తెలంగాణ రైతుల హక్కులను కాలరాయడం కాదా? విభజన చట్టం ప్రకారం అడవిబిడ్డలకు ఉపాధి కల్పించే బయ్యారం ఉక్కు కర్మాగారానికి పాతరేసి, హైదరాబాద్ రూపురేఖలు మార్చే ఐటీఐఆర్ ప్రాజెక్టును కూడా రద్దు చేయడం తెలంగాణ ప్రజలకు కేంద్రం చేసిన ద్రోహం కాదా? అని మండిపడ్డారు. పేరుకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నా, నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకే అప్పగించే ప్రయత్నాలకు స్వస్తిపలికి వరంగల్ యువత ఉపాధికి భరోసా ఇవ్వగలరా? అని, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి నేటి వరకు అడుగడుగునా తెలంగాణ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్న బీజేపీ ఈ రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలోకి రాదు.. రాలేదని కేటీఆర్ వెల్లడించారు.