ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లో బండి సంజయ్ గల్లీలో, డిల్లీలో ఎక్కడైనా కనిపించారా? అని ప్రశ్నించారు. హుజురాబాద్ రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ వినోద్.. ప్రజల తరుఫున పార్లమెంటులో గళం విప్పాడని చెప్పారు. నాయకుల ప్రలోభాలకు లొంగవద్దని ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు నెరవేర్చారా..? అన్నారు. కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పోరాడే వ్యక్తులే పార్లమెంటుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే సత్తా వినోద్ కు ఉందని సూచించారు.
మోడీ హయాంలో నిత్యావసరాల ధరలు పెరిగాయన్నారు. ముడిచమురు ధరలు తగ్గినా పెట్రో ధరలు మాత్రం తగ్గలేదని చెప్పారు. పెట్రోల్, డీజిల్ పై 34 శాతం ధరలు పెంచారని తెలిపారు. చమురు ధరల పెంపుతో రూ, 30 లక్షల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. రూ. 15 లక్షల కోట్లు అదానీ, అంబానీకి రుణమాఫీ చేశారని వెల్లడించారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ స్పష్టం చేశారు. మోడీ ప్రియమైన ప్రధాని కాదు.. పరమైన ప్రధాని అని చమత్కరించారు. అబ్ కీ బార్ 400 నినాదంతో బీజేపీ ముందుకు వస్తోందన్నారు. ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు రూ. 400 కు చేరుతాయని కెటిఆర్ విమర్శించారు.






