calender_icon.png 17 June, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడేవారేవరూ లేరు

16-06-2025 08:04:14 PM

హైదరాబాద్: ఫార్ములా-ఈ రేసింగ్ కేసు(Formula-E Racing Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అవినీతి నిరోధక బ్యూరో విచారణ(Anti-Corruption Bureau Investigation) ముగిసింది. కేటీఆర్(KTR)ను సుమారుగా 8 గంటలపాటు ప్రశ్నించిన ఏసీబీ అమసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో మరోసారి విచారణకు హాజరైన అనంతరం, తెలంగాణ భవన్‌కి చేరుకున్న కేటీఆర్ కు బీఆర్‌ఎస్ శ్రేణుల ఘన స్వాగతం పలికారు. ఏసీబీ విచారణ తరువాత తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే కాని తాను ఎలాంటి తప్పు, తలదించుకునే పని చేయలేదన్నారు.

నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మంది ముందు ఫార్ములా ఈ రేసు గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే రేవంత్ రెడ్డి పారిపోయిండని విమర్శించారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు సాహసించని లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని తానంటే రావడానికి రేవంత్ రెడ్డికి ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. మొదటి సంవత్సరం ఫార్ములా రేసు విజయవంతం కావడంతో రెండవ సంవత్సరం కూడా ఎలాగైనా హైదరాబాద్ లోనే నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుందని తెలిపారు. అందులో భాగంగానే నిర్వహణ సంస్థ బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించిన విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించానని వెల్లడించారు. ఇందులో అవినీతి ఎక్కడ ఉందని, తాను అధికారులను ప్రశ్నిస్తే వారి దగ్గరి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు.

అసలు కరప్షనే జరగని ఓ తుపేల్ కేసులో ఏసీబీని ఇన్వాల్వ్ చేయడాన్ని తన 26 ఏళ్ల కెరీర్ లో చూడనే లేదని మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.  చిట్టినాయుడు రాసిచ్చిన పనికిమాలిన ప్రశ్నలనే పొద్దుటి నుంచి అటుతిప్పి ఇటు తిప్పి ఏసీబీ అధికారులు అడిగారని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వ పెద్దల నుంచి అరెస్ట్ చెయ్యాలని ఒత్తిడి ఉంటే బేషుగ్గా చేసుకోవచ్చని అధికారులకు చెప్పానన్న కేటీఆర్, అవసరమైతే తెలంగాణ కోసం మరోసారి జైలుకు వెళ్లడానికి కూడా సిద్దమన్నారు. రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడేవారు ఎవరూ బీఆర్ఎస్ లో లేరన్నారు కేటీఆర్. 50 లక్షల డబ్బుల బ్యాగుతో లుచ్చా పని చేసి అడ్డంగా దొరికి నెల రోజులు జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి, తమను కూడా ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలన్న శాడిస్ట్ ఆలోచనతో ఉన్నాడని కేటీఆర్ తెలిపారు.

అందులో భాగంగానే తెలంగాణ సాధించిన కేసీఆర్ ను, మాజీ మంత్రి హరీశ్ రావును కాళేశ్వరం కమిషన్ ముందుకు,తనను ఏసీబీ విచారణకు పిలుస్తున్నాడని చెప్పారు. అయితే ఇవన్నీ లొట్టపీసు కేసులు రేవంత్ రెడ్డి ఓ లొట్ట పీస్ ముఖ్యమంత్రి అన్న కేటీఆర్, కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేతకాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదని విమర్శించారు. దద్దమ్మ రాజకీయాలతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అక్రమ కేసుల్లో తమకు నోటీసులు రావడం పాత చింతకాయ పచ్చడిలా మారిందన్న కేటీఆర్, బీఆర్ఎస్ కేడర్  వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పెడితే ఒక 15 రోజులు తనను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందడం తప్ప ఇంకేం చేయలేడన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే, తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రం అని అంటే,ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు దొంగను చూసినట్టు చూస్తున్నారంటే బరాబర్ రేవంత్ రెడ్డిని హౌలా అనే అంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. 2019 జూన్ 21 నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఆరు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కాళేశ్వరం గొప్పదనాన్ని ప్రజలకు తెలియచేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిగీసి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఫుట్బాల్ ఆడి చిత్తుచిత్తుగా ఓడించడం మీద బీఆర్ఎస్ నాయకులు దృష్టి పెట్టాలన్నారు కేటీఆర్. పొద్దుటి నుంచి ఓపికగా తనకోసం ఎదురు చూసినఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,పార్టీ కార్యకర్తలు,నాయకులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.