18-08-2025 11:27:01 AM
హైదరాబాద్: రామంతపూర్లోని గోఖలే నగర్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా ఐదుగురు విద్యుత్ షాక్కు గురై మరణించిన విషాద ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి మరణాలు తనని తీవ్రంగా కలచివేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమైనదని అన్నారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో నలుగురు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.