20-07-2025 12:18:24 PM
హైదరాబాద్: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. దర్వాజా సింహవాహిని అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించడంతో పాటు బండారు దత్తాత్రేయ బంగారు బోనం సమర్పించారు. అలాగే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బోనాలు సమర్పించేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లాల్ దర్వాజా ఆలయం వద్ద 1200 మంది పోలీసులతో ప్రభుత్వం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. బోనాలు జరుతుగున్న తీరును సమీక్షించేందుకు ఆలయంలో పరిసరా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అమ్మవారి బోనాల భద్రతా విధుల్లో సీటీ పోలీసులతో పాటు, జిల్లా పోలీసులు కూడా హాజరయ్యారు.