10-05-2025 12:06:35 AM
నాగర్ కర్నూల్ మే 9 (విజయక్రాంతి):నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లింగాల మండలం అప్పాపూర్, మల్లాపూర్ చెంచు పెంటల్లో శుక్రవారం లీగల్ అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి నసీం సుల్తానా అక్కడి చెంచులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టాలు, హక్కుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మౌలిక సదుపాయాల అంశాలపై అరా తీశారు.
చాలాకాలంగా కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోవడం లేదని చెంచులు తమ దృష్టికి తీసుకువచ్చారు. తాగడానికి గుక్కెడు నీరు కూడా కరువైందని ఎండల తాకిడికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెంచులు ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ డ్యాం, లేదా బోర్ బావి, చేతిపంపులను ఏర్పాటు చేస్తే నీటి సమస్య తీరుతుందని తెలిపారు.
వీధిలైట్లు అవసరం ఉందని కనీసం ఆధార్, రేషన్, పెన్షన్ సమస్యలను కూడా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని చెంచులకు హామీనిచ్చారు. క్యాంప్లో చెంచు ప్రజలకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం అచ్చంపేట పట్టణంలోని బాలసదన్న సందర్శించి అక్కడి విద్యార్థులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.