నిర్మాతలంతా కలిసికట్టుగా ఉందాం
ఫిల్మ్ చాంబర్ ఎన్నికల నేపథ్యంలో ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ సూచన
తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో ప్రస్తుతం ఫిల్మ్నగర్ సర్కిళ్లలో నడుస్తున్న టాపిక్ అంతా ‘మన ప్యానెల్’ వర్సెస్ ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ అన్నట్లుగా మారింది. మార్కెట్లో బలంగా ఉన్న పెద్ద నిర్మాతలు ఒకవైపు.. చిన్న నిర్మాతలు ఒకపైపు ఆదివారం జరగబోయే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానల్కు దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్బాబు వంటి దిగ్గజ నిర్మాతలు మద్దతు పలుకుతున్నారు. చదలవాడ శ్రీనివాసరావు, సీ కల్యాణ్, ప్రసన్నకుమార్ అండదండలతో మన ప్యానెల్ బరిలో నిలిచింది. చాంబర్ ఎన్నికల నేపథ్యంలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ శనివారం ప్రెస్మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. “ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ వచ్చాం. కానీ కొందరు ఇంకా కావాలనే సమస్యలను సృష్టిస్తున్నారు. వారి వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారని తెలిసింది. యూనియన్ నాయకులు లోపాయికారిగా ఓటు బ్యాంక్ రాజకీయాలతో తప్పుడు హామీలు ఇస్తున్నారు. వారి పద్ధతి మార్చుకోమని చెప్పాం. సినిమాల నిర్మాణం పెంచాలని, పని ముఖ్యమని చెప్పాం. యూనియన్ విషయంలో ముందొక మాట వెనుక ఒక మాట మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా లబ్ధి పొందే అవసరం మాకు లేదు. పది మందికి ఉపయోగపడాలనే చూస్తున్నాం. ఇది అమ్మలాంటి సంస్థ. ఆ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
ఈ ఇండస్ట్రీకి ఫాదర్ లాంటి వారు ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ బతికితేనే ఇండస్ట్రీ రన్ అవుతుంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్గా ఏం చేయాలనుకుంటున్నామో అందరికీ వివరించాం. అందరు మా పానల్ను గెలిపించాలని కోరుకుంటున్నాం” అన్నారు. మైత్రీ నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. “మా ప్యానెల్లో ఉండే నిర్మాతలు అందరూ సంవత్సరానికి దాదాపు -80 చిన్న సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటాం. నిర్మాత సినిమాను థియేటర్లో ఆడించుకోవడమనే తన హక్కు. ఈ విషయంలో మేమందరం సపోర్ట్ చేసి చిన్న సినిమాల్ని రిలీజ్ చేస్తుంటాం. నిర్మాతలు అందరం కలిసికట్టుగా ఉందాం. ఈ ప్యానల్ను అందరు గెలిపించాలని కోరుతున్నాం. గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్గా ఉంది” అని చెప్పారు.
రవికిషోర్ మాట్లాడుతూ.. “ఇది రన్నింగ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ గురించి ఏర్పాటు చేసిన పానెల్. సినిమాలు తీసే నిర్మాతలు ఒకరికి ఒకరు తోడ్పాటుగా ఉంటూ ముందుకు సాగాలని ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ప్యానల్ ఇది. క్యూబ్, యూఎఫ్వో కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఎగ్జిబిటర్స్ కట్టాల్సిన ఈఎంఐలు కూడా మాతో కట్టిస్తున్నారు. అదంతా అంతర్గతమైన సమస్య. మేము మేము సర్దుబాటు చేసుకుని చూసుకోవాల్సిన వ్యవహారం ఇది. అందరం కలిసి పనిచేసుకుందాం. సినిమా చేసే ప్రతి వ్యక్తికి మా సేవలు అందుతాయి” అని తెలిపారు. ఈ ప్రెస్మీట్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నిర్మాతలు పాల్గొన్నారు.




