13-06-2025 12:00:00 AM
రాష్ట్రంలో తొలిసారిగా 14 ఏళ్ల తర్వాత జరుగుతున్న సినీ అవార్డుల వేడుకను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ)తోపాటు చిత్రపరిశ్రమకు కూడా ఉందని ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ సినీ పురస్కారాల ప్రదానోత్సవం వివరాలను గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరించారు.
అహ్మదాబాద్లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఈ ప్రెస్మీట్కు హాజరుకాలేకపోయారని దిల్ రాజు చెప్పారు. ఆ విషాదకర ఘటనపై మౌనం పాటిస్తూ సంతాపం తెలిపారు. అనంతరం అవార్డుల ప్రదానోత్సవం వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. “రాష్ట్రంలో 14 ఏళ్ల తర్వాత హస్తం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న గద్దర్ సినీ పురస్కారల వేడుకను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఎఫ్డీసీతోపాటు ఇండస్ట్రీకీ ఉంది.
ఈ నెల 14న సాయం త్రం 6 గంటలకు అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమవుతుంది. ఆ ఈవెంట్ను ఐ అండ్ పీఆర్ (సమాచార పౌరసంబంధాల శాఖ) ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నాం. తెలుగు స్టార్ హీరో ల సినిమాలు ఇప్పుడు పాన్ఇండియాగా రిలీజ్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా అభిమానులున్నారు. వారికోసం ఈ గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని సైతం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తు న్నాం.
తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులకు చేరువవ్వాలని కోరుకుంటున్నాం. 2014 నుంచి 2023 వరకు.. ఏడాదికి మూడు చొప్పున ఉత్తమ సినిమాలను ఇప్పటికే ప్రకటించాం. ఈ సినిమాలకు సంబంధించి కథానాయకుడు, కథానా యిక, దర్శకుడు, నిర్మాతకు అవార్డులు ఇస్తున్నాం.
ఉత్తమ సినిమాలకు గాను ఇలా నలుగురికి పురస్కారాలు ఇస్తుండటం తొలిసారి. ఈ వేడుకకు సంబంధించి ఆహ్వానపత్రికల అందజేత ఈరోజు పూర్తయ్యింది. అందరూ హాజరై, విజయవంతం చేయాలని కోరుతు న్నాం” అని పేర్కొన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ఈ అవార్డుల కార్యక్రమం జరగనుంది.