విద్యుత్ వ్యవస్థ రక్షణకు లైట్నింగ్ అరెస్టర్లు
సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో మెరుపులు, పిడుగుల కారణంగా విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లకు నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఉత్తమ్ జాడే తెలిపారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను రక్షించేందుకు కీలక ప్రాంతాల్లో లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 80 లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
లైట్నింగ్ అరెస్టర్ అనేది మెరుపు పిడుగు వల్ల ఉత్పన్నమయ్యే అధిక వోల్టేజ్ను భూమిలోకి సురక్షితంగా మళ్లించే రక్షణ పరికరమని ఆయన వివరించారు. దీని ద్వారా ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్గియర్ పరికరాలు తదితర విద్యుత్ యంత్రాంగం సురక్షితంగా ఉండడంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయని తెలిపారు. మెరుపుల కారణంగా జరిగే బ్రేక్డౌన్లు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు.
వర్షాకాలంలో వినియోగదారులు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించిన ఆయన, ఇంటి విద్యుత్ పరికరాలకు సర్జ్ ప్రొటెక్టర్లు వినియోగించడంతో పాటు మెరుపులు, పిడుగుల సమయంలో అనవసరంగా విద్యుత్ పరికరాలను తాకకుండా ఉండాలని సూచించారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తోందని తెలిపారు.




