ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి
రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
రంగారెడ్డి జిల్లా, మే 12 (విజయక్రాంతి): స్థానిక సంస్థలు కేవలం ప్రభుత్వ గ్రాంట్లపైనే ఆధారపడకుండా, స్వయం సమృద్ధి సాధించేలా ఆదాయ వనరులను పెంపొందించు కోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సదస్సులో అధికారుల తో పలు విషయాలు చర్చించారు.
స్థానికంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని, అనవసర ఖర్చులను నియంత్రించాలని రాజయ్య సూచించారు. పన్ను వసూళ్లు, ప్రకటనల రాబడి, వృత్తి పన్నులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అనే నినాదంతో, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు స్థానిక సంస్థలు కృషి చేయాలని కోరారు.ప్రతి నివాసానికి రక్షిత మంచినీరు, మెరుగైన పారిశుధ్యం, వీధి దీపాలు మరియు పచ్చదనం పెంపు వంటి కనీస అవసరాల పర్యవేక్షణలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల బలోపేతానికి ప్రజాప్రతినిధులు, అధికారుల నుండి సేకరించిన సలహాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్య దర్శి కాత్యాయని, సభ్యుడు ఎస్. సుధీర్ రెడ్డి, రంగారెడ్డి అదనపు కలెక్టర్ కిరణ్మయి, దక్షిణ తెలంగాణ జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.






