బ్యాంకులో ఖాతాలపై లాక్లు తొలగించాలి
బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్
సిద్దిపేట రూరల్ (విజయక్రాంతి): సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘాల సభ్యులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, పింఛన్ లబ్ధిదారుల ఖాతాలకు లాక్లు విధించడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతు భరోసా, వడ్ల, ఇతర సంక్షేమ పథకాల నిధులు, పింఛన్ నగదు ఖాతాల నుంచి తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పుల్లూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ బ్యాంకు మేనేజర్తో మాట్లాడి వీలైనంత త్వరగా అన్ని సమస్యలను పరిష్కరించి, అర్హులైన ఖాతాదారుల ఖాతాలపై ఉన్న లాక్లను వెంటనే తొలగించాలని, సరైన కారణం లేకుండా ఎవరికి కూడా ఖాతాలపై లాక్లు విధించవద్దని సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు శ్రీహరి, రాజు తదితరులు పాల్గొన్నారు.






