24-06-2025 12:44:44 AM
గజ్వేల్, జూన్23: సిసి రోడ్లు, మురికి కాలువలు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణానికి నోచుకోలేదంటూ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 9,10 వార్డుల ప్రజలు సోమవారం మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య కు విన్నవించారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కళ్యాణ్ కర్ నర్సింగరావుతో కలిసి ఆయా వార్డుల ప్రజలు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9,10 వార్డులో గతంలోనే సీసీ రోడ్ల నిర్మాణానికి బడ్జెట్ విడుదలైనా నేటికీ కూడా రోడ్ల పనులు ప్రారంభించలేదన్నారు. 9వ, 10వ వార్డు లతోపాటు ఎస్.సి కాలనిని అనుసంధానం చేసే ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుందన్నారు. వర్షాకాలం కావడం వల్ల రోడ్డుపైన వర్షపు నీళ్లతో బురద మయమై సీజనల్ వ్యాధులకు ప్రజలు గురవుతున్నారని, త్వరగా వార్డులో రోడ్డు పనులు మురికికాలువల నిర్మాణ పనులు చేపట్టి తమ సమస్యలను పరిష్కరించాలన్నారు.
అలాగే పాత కూరగాయల మర్కెట్ వద్ద రోడ్డు వెడల్పు చిన్నదిగా ఉన్నందున ప్రజల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని, రోడ్డును మరింత వెడల్పుగా చేయాలని కోరారు. కార్యక్రమంలో మనోహర్, ఉప్పల శ్రీనివాస్, నర్సింలు, నాయిని రాములు, మేర శ్రీనివాస్, మల్లారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.