12 August, 2026 | 10:07 AM

లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం

12-08-2026 09:13 AM

హనుమకొండ, (విజయక్రాంతి): బ్రిటన్ పార్లమెంటులో హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా నియమితులైన లార్డ్ ఉదయ్ కుమార్ నాగరాజు తెలంగాణకు గర్వకారణమని మాజీ ఎంపీ బోయనపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం రోజున రాంనగర్ నిత్య బ్యాంకెట్ హాల్ నందు తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి  హాజరై వారిని మెమొoటో అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వినోద్ కుమార్  మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన లార్డ్ ఉదయ్ కుమార్ నాగరాజు కి వరంగల్‌ తో విడదీయరాని అనుభవం ఉందని, ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం హన్మకొండలోని నక్కలగుట్టలో జరిగిందనీ,అనంతరం హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో విద్యాభ్యాసం కొనసాగించి, రాంటెక్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారనీ,ఉన్నత విద్యను లండన్‌లోని ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీలో అభ్యసించారనీ, కేవలం 47 సంవత్సరాల వయస్సులోనే, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నియమితులైన తొలి వ్యక్తిగా ఆయన సాధించిన ఘనత తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వరంగల్–కరీంనగర్ ప్రాంత ప్రజలకు గర్వకారణంఅన్నారు.

తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, బ్రిటన్ పార్లమెంటులో విశిష్ట స్థానాన్ని అలంకరించిన లార్డ్ ఉదయ్ కుమార్ నాగరాజు ని సత్కరించడం ఎంతో గౌరవం అని,తెలంగాణ ప్రాంతానికి గర్వకారణం అన్నారు.ఉదయ్  ఏఐ లో నిష్ణాతులు, సాంకేతికత ద్వారా ప్రజలకు చేసిన సేవకు సరైన గుర్తింపు దక్కిందని,ఉదయ్ తెలంగాణ విద్యార్థులకు, ఉద్యోగులకు, ప్రజలకు ఏఐ సాంకేతికతను మరింత చేరువ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేశపతి శ్రీనివాస్, మద్దిరాజు గణేష్, మాజీ ఎమ్మెల్యేలు వోడితెల సతీష్ బాబు,మార్తనేని ధర్మారావు, నన్నపునేని నరేందర్, వినయ్ భాస్కర్, లింగంపల్లి కిషన్ రావు, వాసుదేవ రెడ్డి, రాకేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.