పొలంలోకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరు మహిళలు మృతి
చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం లారీ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళ కూలీలు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామ శివారులోని ఓ మిల్లుకు చెందిన లారీ పత్తి గింజలను లోడ్ చేసుకుని వెళ్తోంది. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా వెళుతున్న లారీ... పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. కాగా రామకృష్ణాపూర్ (టి) గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మొకిడి సంధ్య, పులమ్మ వరి పొలంలో పువ్వు దులపడానికి పనికి వెళ్లారు. అతివేగంతో అదుపుతప్పి వచ్చిన లారీ వారిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో సంధ్య, పులమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనస్థలికి చేరుకున్న చిట్యాల పోలీసులు(Chityal Police) మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, విచారణ చేపడుతున్నారు.






