అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీ పట్టివేత
సుమారు 30 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
ఇద్దరు డ్రైవర్లు, బియ్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
పిట్లం పోలీసుల పనితీరును అభినందించిన జిల్లా ఎస్పీ
కామారెడ్డి, ఆగస్టు 14 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం పోలీసులు శుక్రవారం సాయంత్రం అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నారు. పిట్లం పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి గుజరాత్కు 161 వ జాతీయ రహదారి మీదుగా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న సమాచారం రావడంతో పిట్లం పోలీసులు పట్టుకున్నారు. పిట్లం ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది వెంకటేష్, రాజేశ్వర్లతో కలిసి పిట్లం చౌరస్తా సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న GJ-25-U-7022 నంబర్ గల లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో 632 పాలిథిన్ కవర్లలో సుమారు 30 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి లారీ డ్రైవర్లు గుజరాత్ రాష్ట్రంలో సూరత్ జిల్లా పర్బత్ కరంటా కు చెందిన దేవరాజ్, మహారాష్ట్ర లోని దూలే జిల్లా బచ్కర్ కు చెందిన శరద్ మహారాష్ట్రతో పాటు బియ్యం తరలిస్తున్న వ్యక్తి ఇబ్రహీం, పై హైదరాబాద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిట్లం ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది వెంకటేష్, రాజేశ్వర్లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యాన్ని సమర్థవంతంగా పట్టుకుని స్వాధీనం చేసుకున్నందుకు వారి పనితీరును ప్రశంసించారు.






