16-06-2025 12:51:01 AM
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న కాన్సెప్ట్- సెంట్రిక్ చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనంతిక సనీల్కుమార్ లీడ్ రోల్ పోషించారు. హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను ఆదివారం రిలీజ్ చేసింది.
‘ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు. అంత్యక్రియలకు కర్మ కాండలకు వాళ్లు పనికిరారు’ అంటూ ఓ క్యారెక్టర్ చెప్పిన మాటలకు ‘పేగు పంచి ప్రాణం పొయ్యగలిగిన వాళ్లం.. చితిముట్టించి మోక్షం ఇప్పించలేమా’ అంటూ అనంతిక బదులు చెప్పిన సన్నివేశంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. ఇది కేవలం ఒక మహిళ ప్రయాణం కాదు, సమాజంలో చెరపాల్సిన మూఢనమ్మకాలకు ఎదురు నిలిచే కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
తండ్రి చేతే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతూ, ఆనందం, ప్రేమ, విషాదం లాంటి అనుభూతులతో అనంతిక ప్రయాణం సాగుతుంది. ప్రతి వసంతం ఒక కీలక మలుపు. ఆమె ఒక కుమార్తెగా మొదలై, కొన్ని విధానాలను ఎదురించే ధైర్యవంతురాలిగా మారడాన్ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. అనంతికా సనీల్కుమార్ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల పాత్రలు కూడా కథకు అర్థవంతమైన బలాన్నిస్తాయి.
ముఖ్యంగా ఇందులో ‘ప్రేమ జీవితంలో ఒక దశ మాత్రమే.. అదే దిశ కాదు’, ‘మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకు ఏముంది. మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప’ వంటి డైలాగులు మనసును హత్తుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్; డీవోపీ: విశ్వనాథ్రెడ్డి; ఎడిటర్: శశాంక్ మాలి; యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి.