16-10-2025 06:11:31 PM
-రిజర్వేషన్లు సామాజిక హక్కు
-బి.సీ అడ్వకేట్ జే ఏసీ
నల్గొండ టౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటున్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా అక్టోబర్ 18 తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని బీసీ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ లు జెనిగల రాములు, గిరి లింగయ్య గౌడ్, విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కోర్టులో బంద్ పోస్టర్ ను బి.సి అడ్వకేట్ జేఏసీ అధ్వర్యంలో కోర్టు ఆవరణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం అంటేనే కుల పునాదుల మీద నిర్మితమైన వ్యవస్థ అన్నారు. జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణలో ఉద్యమం కొనసాగుతుందన్నారు. జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఒక ప్రజాస్వామిక బద్ధమైన సూత్రమని, రిజర్వేషన్ల లక్ష్యం సామాజిక వర్గాల మధ్య సమానత్వం సాధించడమే తప్ప సామాజిక వర్గాల లోపల అసమానత్వం సాధించడం కాదన్నారు.
రిజర్వేషన్లకు సంబంధించి భారత రాజ్యాంగంలో నిర్ణితమైనటువంటి పరిమితి విధించలేదన్నారు.పలు సందర్భాలలో ఆయా రాష్ట్రాలలోని హైకోర్టులలో ను,కేంద్రంలోని సుప్రీం కోర్టు లో జరిగిన వాదనల ద్వారా గీసిన సరిహద్దు గీతలు ఉన్నాయని, ఆ గీతలను దాటి రిజర్వేషన్లను పెంచిన సందర్భాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ వద్దకు పంపడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఏకపక్షంగా ఆమోదం తెలిపినాయన్నారు.తెలంగాణలోని బుద్ధి జీవులు విద్యావంతులు మేధావులు మొత్తంగా తెలంగాణ సమాజం స్వాగతించిందన్నారు.కాని జరగాల్సిన ప్రక్రియను జరగకుండా కొంతమంది వ్యక్తులు కొన్ని స్థాయిలలో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయన్నారు.రిజర్వేషన్లు సమాన అవకాశాలకు మినహాయింపు కాదని సమాన అవకాశాలకు ఒక సాధనమని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్నదన్నారు.
42% బి.సీ రిజర్వేషన్ల పెంపు దిశగా వివిధ రూపాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి పెంచడానికి స్పష్టమైన కార్యాచరణతో ఉద్యమం కొనసాగుతుందన్నారు.అందులో భాగంగా అక్టోబర్ 18న తెలంగాణ బంద్ కు వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అక్టోబర్ 18 బంద్ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జి.జవహ్రలాల్,నేతి రఘుపతి,ఎండి నజీరుద్దిన్, వేములకొండ సత్తయ్య, లింగంపల్లి సురేష్, జలేంధర్, పజ్జురి స్వామి గౌడ్, పందుల సైదులు,ఇందిర, ఏ.ఐలయ్య,ముత్యాల నరసింహ, బి.శ్రీనయ్య, అప్రోజ్, వంశీ,ప్రేం సుందర్,కంచనపల్లి రవీందర్, శంకర్ బాబు,జోగు నగేష్,యాదగిరి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.