04-11-2025 09:00:52 PM
మహాసభల లోగో ఆవిష్కరించిన ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో జరిగే పిడిఎస్యు రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో మహాసభ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పిడిఎస్యు రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాస్ లు మాట్లాడుతూ చారిత్రాత్మక పోరాట వారసత్వం ఉన్న పిడిఎస్యు రాష్ట్ర మహాసభలు ఉద్యమాల కేంద్రం వరంగల్ జిల్లాలో నిర్వహించడం అభినందనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల విద్య పేదలకు మరింత దూరం అవుతుందన్నారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా నేటికీ విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందకుండా ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకుంటున్నాయన్నారు. పాలకులు కార్పొరేట్, పెట్టుబడే దారులకు ఊడిగం చేసేందుకే ప్రభుత్వాలను నడుపుతున్నాయన్నారు. ప్రభుత్వ విద్యారంగం ధ్వంసం అవుతుందని అనేక పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు మూసివేత గురి అవ్వడమే దీనికి తార్కాణం అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోనే ఉన్న చట్టాలను కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చారన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు.
కనీసం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబ ర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా విద్యార్థులకు ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తుం దన్నారు. డిసెంబర్ 10న ఆర్ట్స్ కాలేజ్ ఆల్టోరియం ముందు బహిరంగ సభ 11, 12 తేదీల్లో అబ్నుస్ ఫంక్షన్ హాల్లో జరిగే ప్రతినిధుల సభలను జయప్రదం చేయాలని విద్యా ర్థులకు, మేధావులకు, ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జాతీయ నాయకులు మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనగిరి మధు, డాక్టర్ రాజేష్, వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, సి.పి.ఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, పి.డి.ఎస్.యూ మాజీ నాయకులు బాలరాజు, బండి కోటేశ్వర్, అనిల్ రాజేష్, ప్రకాష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.