25-06-2025 11:16:46 PM
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సోమ పంగు రాధాకృష్ణ..
మోతె: 9వ తేదీన జరిగే దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సోమ పంగు రాధాకృష్ణ(CITU District Vice President Somapangu Radha Krishna) అన్నారు. బుధవారం మండల కేంద్రంలో యంపిడిఓ టి. ఆంజనేయులుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల వలన అన్ని వర్గాల కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నాలుగు లేబర్ కోడును రద్దు చేయాలని కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు ఇచ్చే విధంగా చూడాలని కార్మికులు ఏదైనా ప్రమాదంలో చనిపోతే ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని ముఖ్యంగా గ్రామపంచాయతీలను గత ప్రభుత్వం తీసుకొచ్చిన మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడున్న మల్టీపర్పస్ విధానం వల్ల అనుభవం లేని పనుల వల్ల గ్రామపంచాయతీ కార్మికులు చనిపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు, జులై 9 న దేశవ్యాప్త సమ్మెలో గ్రామపంచాయతీ కార్మికులందరు కలిసి సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల రవిచంద్ర, మండల సిఐటియు కన్వీనర్ దోసపాటి శ్రీనివాస్, గురవయ్య, స్కైలాబ్, వీరారెడ్డి, సైదులు, గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.