బెల్లం చలపతిరావు కుటుంబాన్ని పరామర్శించిన మందడి ఇజ్రాయిల్
తిరుమలాయపాలెం, జూలై 15 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామానికి చెందిన బెల్లం చలపతిరావు ఆదివారం మరణించిన విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల పాలేరు నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ మందడి ఇజ్రాయిల్ బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బెల్లం చలపతిరావు గ్రామంలో రాజకీయ, సామాజిక రంగాల్లో విశేష అనుభవం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారని, ఆయన మరణం గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, పెద్దలు, రాజకీయ నాయకులు, యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు.
గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తూ, అవసరమైన సూచనలు, సలహాలు అందించేవారని గుర్తు చేశారు. ఆయన సేవలను గ్రామ ప్రజలు ఎప్పటికీ మరువలేరని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.






