06-11-2025 01:23:07 AM
అన్ని కాలనీల సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
మణికొండ, నవంబర్ 5(విజయక్రాంతి): ప్రభుత్వ పార్కు స్థలాలు, నాలాలను కబ్జాల బారి నుంచి కాపాడుతున్న ’హైడ్రా’ సంస్థకు మణికొండ వాసులు అండగా నిలిచారు. సుమారు రూ. 500 కోట్ల విలువైన ప్రజా ఆస్తులను పరిరక్షించినందుకు గాను, ’ఫెడరేషన్ ఆఫ్ ఆల్ కాలనీస్ ఆర్డబ్ల్యూఏస్ ఆఫ్ మణికొండ’ ఆధ్వర్యంలో బుధవారం భారీ అవగాహన ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు.
సమాఖ్య అధ్యక్షుడు అర్వపల్లి వంశీ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. మణికొండ మర్రిచెట్టు జంక్షన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వంశీ మాట్లాడుతూ.. పౌరుల విజ్ఞప్తులపై తక్షణం స్పందించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్, స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి బలమైన నాయకత్వం, నిరంతర మద్దతు వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు.
రూ. 500 కోట్ల ఆస్తుల పరిరక్షణ
హైడ్రా చొరవ వల్ల మణికొండ, పరిసర ప్రాంతాల్లో దాదాపు రూ. 500 కోట్ల విలువైన ప్రజా ఆస్తులు రక్షించబడ్డాయని వంశీ పేర్కొన్నారు. ముఖ్యంగా తిరుమల హిల్స్ కాలనీలోని సుమారు రూ.25 కోట్ల విలువగల 6,054 చదరపు గజాల పార్కు స్థలం వెస్ట్రన్ ప్లాజా సమీపంలోని 1.5 ఎకరాలు, నెక్నాంపూర్లోని 3.5 ఎకరాల బఫర్ జోన్ భూములను కాపాడటంలో హైడ్రా పాత్ర అమోఘమని ప్రశంసించారు. పాడెంవాగు, బల్కాపూర్ నాలాల పరిరక్షణకు హైడ్రా అందిస్తున్న సహకారాన్ని కూడా నివాసితులు అభినందించారు.
హైడ్రా సేవలు రాష్ట్రమంతా విస్తరించాలి
హైడ్రా పారదర్శక ఫిర్యాదుల పరిష్కార విధానం, కఠినమైన చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాయని వంశీ నొక్కి చెప్పారు. ఇంతటి సమర్థవంతమైన వ్యవస్థ సేవలను తెలంగాణలోని ఇతర ప్రాంతాల పౌరులకు కూడా అందించాలని, హైడ్రా పరిధిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సభ అనంతరం, నివాసితులు, సమాఖ్య సభ్యులు మర్రిచెట్టు జంక్షన్ నుండి మణికొండ శివాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ’ప్రభుత్వ భూములను కాపాడాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ, హైడ్రాకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో డా. పి. అవినాష్, భరత్ కుమార్ యాదవ్, శ్రీనివాస్ రావు, రంగాచారి, సౌజన్య, ఫెడరేషన్ ఉపాధ్యక్షులు రాజశేఖర్, సింహ రాజా రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బాబు రావు, కృష్ణ కుమార్, రామయ్య, వెంకటేశ్వరరావు, శంకర్ దేవ్, దండి శ్రీనివాస్ రెడ్డి, పులి మల్లికార్జున్, వేముల శ్రీధర్, రాజేశ్వర్ రెడ్డి, హనుమంత రావు, రవి, సూర్య రాణి, వీరభద్రం అశ్విన్తో పాటు వివిధ కాలనీల నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.