రెన్యూవల్ కాని గెస్ట్లు!
ఇంకా గెస్ట్ ఫ్యాకల్టీని విధుల్లోకి తీసుకోని ప్రభుత్వం
- కాలేజీలు ప్రారంభమై 10 రోజులవుతున్నా అంతే..
- కొత్త సిలబస్ చెప్పేదెవరు?
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ప్రభుత్వ కాలేజీల్లో అధ్యాపకుల కొరత వెక్కిరిస్తోంది. కొన్ని కాలేజీల్లో రెండుమూడు సబ్జెక్టులకు మాత్రమే లెక్చరర్లు ఉంటున్నారు. అధ్యాపకుల కొరత కారణంగా గెస్ట్ ఫ్యాకల్టీలతో జూనియర్ కాలేజీలను నెట్టుకొస్తుంటే, వీరిని కూడా సమయానికి రెన్యూవల్ చేయడంలేదు. వారిని విధుల్లో తీసుకోకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.
విద్యాసంవత్సరం ప్రారంభమై పది రోజులవుతున్నా రాష్ట్రవ్యాప్తంగా గెస్ట్ ఫ్యాకల్టీలను తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 430 వర కు ఉన్నాయి. వీటిలో దాదాపు ఐదు వేల కు పైగా రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరికి అదనంగా ఒక్కో కాలేజీలో ఇద్దరు ముగ్గురు గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు.
వీరంతా గత సంవత్సరంలో పని చేసినవారే. అయితే ఈ విద్యాసంవత్సరానికి ఇంకా వారిని విధుల్లోకి తీసుకోలేదు. ఇటీవల జరిగిన ప్రిన్సిపల్ పదోన్నతుల కారణంగా 100కు పైగా ఖాళీలు ఏర్పాడ్డా యి. ఈ పోస్టులను గెస్ట్ అధ్యాపకులతో భర్తీ చేయాలని అధ్యాపక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆర్థిక శాఖ వద్ద ఫైలు?
గెస్ట్ ఫ్యాకల్టీల రెన్యూవల్కు సంబంధించిన ఫైల్ ఆర్థిక శాఖ వద్ద ఉందని సమాచారం. దీనికి ఇంకా క్లియరెన్స్ రాలేదని అధ్యాపక సంఘాల నేతలు ఆరోపి స్తున్నారు. ఈక్రమంలోనే వీరిని విధుల్లో తీసుకోలేదని తెలుస్తోంది. వీరికి పీరియడ్కు ఇంత అనే విధానంలో వేతనం చెల్లిస్తున్నారు. పీరియడ్కు దాదాపు రూ.390 చొప్పున ఏడాది మొత్తం 72 పీరియడ్లను బోధిస్తారు. నెలకు వీరికి వచ్చే వేతనం రూ.28 వేలు వరకు ఉంటుంది. పైగా వీరికి ఏడాదికి కాకుండా పది నెలల వేతనం మాత్రమే చెల్లిస్తారు.
ఈ వేతనాలను కూడా సమయానికి ఇవ్వరు. ఇలా చాలీచాలని వేతనాలతో కాలేజీలల్లో ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగా విధులు నిర్వర్తించడమే కాకుండా అకడమిక్ పనులలోనూ కాలేజీలకు సహకరిస్తూ కాలేజీల అభి వృద్ధికి పనిచేస్తున్న వీరిని రెన్యూవల్ చేయకపోవడంతో వీరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా 2023 ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ మేనిఫెస్టోలో జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్లకు 12 నెలలకు గానూ నెలసరి వేతనం అమలు చేస్తూ.. నెలకు రూ.42 వేల చొప్పున వేతనం చెల్లి స్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లవుతున్నా ఇంతవరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదన్నారు.
అడ్మిషన్లపై ప్రభావం..
జూన్ 1 నుంచే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పునఃప్రారంభమయ్యాయి. అనేక కాలేజీల్లో ఇప్పటికే అధ్యాపకుల కొరత వేధిస్తుండటంతో విద్యాబోధన సక్రమంగా సాగడంలేదు. దీని ప్రభావం విద్యార్థుల అడ్మిషన్లపై పడే అవకాశం ఉంది. పైగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్ విద్యార్థులకు కొత్త సిలబస్ను అమల్లోకి తీసుకొచ్చారు. మరి అధ్యాపకులు లేకుండా ఎలా బోధించాలని? అధ్యాపకులు ప్రశ్నిస్తున్నా రు.
ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపౌట్ సంఖ్యను తగ్గించి, విద్యార్థుల సం ఖ్యను పెంచాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచి కొన్ని కాలేజీల్లో శ్రీకా రం చుట్టిన ప్రభుత్వం,బోధనకు సంబంధించి గెస్ట్ అధ్యాపకులను నియమించాల్సిన అవసరాన్ని ఎందుకు విస్మరించిందని తెలం గాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం జంగయ్య, నయీం పాష ప్రశ్నించారు. మరోవై పు ఈనెల 15 కల్లా అడ్మిషన్లు పెంచాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు అధ్యాపకులకు టార్గెట్ ఫిక్స్ చేశారు.






